- 10 నెలల్లోనే రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు
- ఏపీ ఆర్థికాభివృద్ధికి విశాఖ గుండెకాయ
- విశాఖ నగరాన్ని ఎకనమిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దుతాం
- దేశంలో 5వ అతిపెద్ధ ఆర్థిక నగరంగా విశాఖ ఎదుగుతుంది
- మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన
- విశాఖలో తాజ్ – వరుణ్ బే శాండ్స్ హోటల్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన
విశాఖపట్నం (చైతన్యరథం): చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు శరవేగంగా పరుగులు పెడుతోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించతలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్కు తల్లి భువనేశ్వరితో కలిసి సోమవారం మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బ్రాండ్ ‘బాబు’ తిరిగి వచ్చాడు.. దాంతోపాటు బ్రాండ్ వైజాగ్ తిరిగొచ్చింది… ప్రగతికాముక ప్రభుత్వంగా బ్రాండ్ వైజాగ్ను పునరుద్ధరించాలని మేము సంకల్పం తీసుకున్నాం..గత 10 నెలల చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగాం, వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి, రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలను రప్పించగలిగామన్నారు. వైజాగ్ ఎల్లప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ నగరం కేవలం ఒక అందమైన తీరప్రాంతం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది. దశాబ్దాలుగా వైజాగ్ మాకు అండగా నిలిచింది. ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమం మా దార్శనికతకు నిదర్శనం. తాజ్ వరుణ్ గ్రూప్ అధినేతలు, పరిశ్రమరంగ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, ఇక్కడకు వచ్చిన విశిష్ట అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పాలకులు విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారు. అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. గత ప్రభుత్వ తిరోగమన విధానాలు ఆర్థిక స్తబ్దతకు దారితీశాయి. ఫలితంగా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేసిన లులు వంటి కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
విశాఖలో ఐటి ద్వారా 5లక్షల ఉద్యోగాలు
అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం విశాఖ ప్రజలు మాకు అండగా నిలిచారు, 2019లో రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినా విశాఖలో మమ్మల్ని ఆదరించారు. చంద్రబాబునాయుడుని 53 రోజులు జైలులో నిర్బంధించినపుడు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది మా నినాదం. వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కేవలం విశాఖకే ఐకానిక్ కాదు, యావత్ భారతదేశానికి ఐకానిక్గా నిలవబోతోంది. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతోపాటు విశాఖ ప్రజలు కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు. మా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం వెళ్తుంటే డంపర్లు, టిప్పర్లు అడ్డుపెట్టారు. ఎయిర్ ఇండియా నుంచి త్వరలో రాష్ట్రానికి శుభవార్త రాబోతోంది. భారతదేశ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో విశాఖ రీజియన్ కీలకపాత్ర వహించబోతోంది. విశాఖను ఐటి హబ్గా అభివృద్ధిచేసి, రాబోయే అయిదేళ్లలో యువతకు 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అన్నింటికంటే ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టూరిజం మంత్రి దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 5ఏళ్లలో 50వేల హోటల్ రూమ్లు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో వరల్డ్క్లాస్ క్రికెట్ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉంది. భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో పూర్తికాబోతోంది. దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతోందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఇన్నొవేషన్, బిజినెస్ హబ్గా తీర్చిదిద్దుతాం
విశాఖ నగరాన్ని ఆతిథ్యం, వాణిజ్యం, ఆవిష్కరణల కేంద్రంగా మార్చే మా ప్రయాణంలో తాజ్ వరుణ్ గ్రూప్ కొత్త పెట్టుబడి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో రూ.500 కోట్ల సంయుక్త పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం హోటల్, గ్రేడ్ ఏ ఆఫీస్ బ్లాక్ రెండూ కలిగి ఉన్న ఏకైక పెట్టుబడి ఇది. ఈ పరిణామం విశాఖ నగర స్కైలైన్ను పునర్నిర్వచించడమేగాక లగ్జరీ, వ్యాపారం, ఆవిష్కరణల్లో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫేజ్ 1లో 3,500 ప్రత్యక్ష ఉద్యోగాలు, అదనంగా 500 పరోక్ష ఉద్యోగాలను లభిస్తాయి. మన యువతకు జీవనోపాధి అవకాశాలు, వైజాగ్లో బలమైన ఆర్థిక వ్యవస్థ పునాదికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక లగ్జరీ హోటల్గా మాత్రమే కాకుండా భవిష్యత్తు ఔత్సాహికుల కోసం ఒక మంచి పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. యువ పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు స్థాపించే స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడానికి ఆఫీస్ టవర్ ప్రత్యేక ఏర్పాట్లను కలిగి ఉంటుంది. విశాఖ మహానగరం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే కొత్తతరం కంపెనీలకు కేంద్రబిందువుగా, ఆవిష్కరణల కేంద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ హబ్గా మారే దిశగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అడుగులు వేస్తోంది. వేగవంతమైన పారిశ్రామికీకరణ కోసం స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం, పరిశ్రమలు అభివృద్ధి చెందగల డైనమిక్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
స్నేహపూర్వక విధానాలతో పెరిగిన నమ్మకం
ఆంధ్రప్రదేశ్లో మేము తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాం. గత పది నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఎల్జీ, టాటా పవర్ వంటి అనేక ప్రధాన సంస్థలు రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 5 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి ముందుకువచ్చాయి. ఈ పెట్టుబడులు మేం నిర్మిస్తున్న ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్కు నిదర్శనం. భారతదేశ మలిదశ ఆర్థికవృద్ధికి నాయకత్వం వహించేందుకు ప్రస్తుతం ఏపీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలో చేపడుతున్న స్నేహపూర్వక, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల కారణంగా పరిశ్రమదారుల్లో నమ్మకం పెరగడమేగాక ఏపీ భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. మా ప్రభుత్వంపై నమ్మకంతో విశాఖ నగరాన్ని తమ తదుపరి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకున్న తాజ్ – వరుణ్ గ్రూప్ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము మా ఎన్నికల మ్యానిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు ధైర్యంగా వాగ్దానం చేసాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం మేం అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం మరో నాలుగు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పునరుజ్జీవనం కోసం మేం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు… ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా, స్థిరమైన ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తాయి. ఈ క్రమంలో విశాఖపట్నం ఏపీకి గుండెకాయగా నిలుస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే… రాబోయే రోజుల్లో విశాఖను మరింత పచ్చదనంగా, సంపన్నవంతంగా, ఎకనమిక్ పవర్ హౌస్గా తీర్చి దిద్దేందుకు అందరం కలసికట్టుగా కృషిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
విశాఖకే మణిహారంగా తాజ్ `వరుణ్ బీచ్ శ్యాండ్స్
హెరిటేజ్ గ్రూప్ ఎండీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ…. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన నిర్మితం కానున్న తాజ్- వరుణ్ బే శ్యాండ్స్ హోటల్ విశాఖ నగరానికే కాకుండా ఏపీకే మణిహారంగా నిలువబోతోందని తెలిపారు. ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తానెప్పుడూ టీమ్ వర్క్ను నమ్ముతానన్నారు. వరుణ్ గ్రూప్ అధినేత ప్రభుకిషోర్ టీమ్ వర్క్తో ఈ కొత్త ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. పదవులతో సంబంధం లేకుండా ప్రభు కిషోర్ ఎల్లవేళలా మా కుటుంబంపై అప్యాయత కనబరుస్తూ మద్దతుగా నిలిచారు, ఆయన అద్భుతమైన, క్రమశిక్షణతో కూడిన పారిశ్రామికవేత్త అన్నారు. ఎంతఎత్తుకు ఎదిగినా హుందాగా నిరాడంబరమైన జీవనాన్ని సాగిస్తూ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నారని కొనియడారు. ప్రభుకిషోర్ విజయం వెనుక ఆయన భార్య లక్ష్మి పాత్ర కీలకమైందన్నారు. భార్య సహకారం లేనిదే ఏ వ్యక్తీ ఉన్నత శిఖరాలను అధిరోహించలేడు. జీవితంలో అనుకున్నది సాధించడానికి వయసుతో సంబంధం లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, ఎండీ వరుణ్ దేవ్, డైరెక్టర్ హర్ష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, విశాఖ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ, ఏసీఏ మాజీ చైర్మన్ గంగరాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. తదితరులు పాల్గొన్నారు.