తిరుమల (చైతన్యరథం): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండిరచింది. ఆ ఆరోపణలు అవాస్తమని స్పష్టం చేసింది. ఈ నెల 8న స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయమైందని సదరు వ్యక్తి ఆరోపించారు. వెంటనే స్పందించిన టీటీడీ, సదరు వ్యక్తిని అంబులెన్సు ద్వారా తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలలో ఆ వ్యక్తి ప్రసాదం తినేటప్పుడు తన నాలుకను తానే కొరుక్కోవడంతో నాలుక కింద భాగంలో కేవలం చిన్నపాటి గాయం అయినట్లు తేలింది. అయినప్పటికీ, టీటీడీ వద్ద నష్ట పరిహారం పొందాలనే దురుద్దేశంతో సదరు వ్యక్తి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. ప్రజలను గందరగోళపరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత చర్యకు పాల్పడిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.