- ఆర్థికమంత్రి పయ్యావులతో మంత్రి లోకేష్ సమీక్ష
- పాల్గొన్న జీఎస్డబ్ల్యూఎస్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు
ఉండవల్లి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా గురువారం నుంచి ప్రారంభించిన బాబు సూపర్ సిక్స్ హామీ తల్లికి వందనం పథకం అమలు జరుగుతున్న తీరుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ అధికారులతో పాటు ఆర్థికశాఖ, జీఎస్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయో వివరాలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులు ఎంతమంది ఉన్నా వారందరికీ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఆర్బీఐ దగ్గర ఫండ్ క్లియరెన్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి నిధుల జమకాని వారి నుంచి షెడ్యూల్ ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలు, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. తల్లుల బ్యాంక్ ఖాతాలు ఇన్ యాక్టివ్గా ఉన్నవారి విషయంలో యాక్టివ్ చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపి అప్రమత్తం చేయాలని, వారు ఖాతాలు యాక్టివ్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా అకౌంట్లో జమచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, కమిషనర్ శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.