- కర్నూలు జిల్లాలో ఏరువాకలో పాల్గొన్న మంత్రి
కర్నూలు (చైతన్యరథం): వైకాపా హయాంలో అన్ని రంగాలూ నిర్వీర్యం అయినట్టే అతి ప్రధానమైన వ్యవసాయ రంగం కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైందని కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కల్లూరు మండలం తడకనపల్లెలో బుధవారం జరిగిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొలం దున్ని, ఉల్లి విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా హయాంలో రైతు భరోసా కేంద్రాలని చెబుతూ వాటిని రైతు భక్షక కేంద్రాలుగా మార్చేశారని విమర్శించారు. రైతులకు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చెల్లించ లేదన్నారు. రాయలసీమలో నాడు చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తే, గత ప్రభుత్వంలో డ్రిప్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు సంబంధించి అత్యవసర పనులకు కనీసం నిధులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గుండ్లకమ్మ, అన్నమయ్య డ్యామ్లు కొట్టుకుపోయాయని విమర్శించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా పేర్కొన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటూ, రైతులందరికి ఏరువాక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా, తదితరులు పాల్గొన్నారు.