- అధికారులకు మంత్రుల బృందం ఆదేశం
- న్యాయ వివాదాలను పరిశీలించాలని స్పష్టీకరణ
- ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై మంత్రుల బృందం సమీక్ష
- పూర్తి అధ్యయనం తర్వాత వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయం
అమరావతి (చైతన్యరథం): ఆప్కాస్ వ్యవస్థపై పూర్తి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని అధికారులను ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం ఆదేశించింది. ఈ మేరకు సచివాలయం నాలుగు బ్లాక్ లోని విద్యాశాఖ చాంబర్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం మంగళవారం అధికారులతో మొదటిసారి సమావేశమయింది ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1,07,082 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను అధికారులు వివరించారు. మొత్తం ఉద్యోగుల్లో అత్యధికంగా స్వీపర్లు, పబ్లిక్ హెల్త్ వర్కర్లు 28.89శాతం, అటెండర్లు 9.64శాతం, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 9.10శాతం మంది ఉన్నారు. 2020 నుంచి చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై అధికారులను మంత్రుల బృందం ఆరాతీసింది. న్యాయవివాదాలను పరిశీలించాలని, ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనపై పూర్తి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. పూర్తి అధ్యయనం తర్వాత మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి డీ రోనాల్డ్ రోస్, సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ, ఆప్కోస్ ఎండీ జీ వాసుదేవ రావు, తదితరులు పాల్గొన్నారు