- అరుదైన ఖనిజాల వెలికితీతకు యూనివర్సిటీల భాగస్వామ్యం
 - పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం
 
లండన్ (చైతన్య రథం): అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని.. ఏపీలో జలరవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లాజిస్టిక్ కారిడార్ ద్వారా ఏపీని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు సీఎం లండన్లోని పారిశ్రామికవేత్తలకు వివరించారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సోమవారం వివిధ పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. అలాగే ఈనెల విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హజరు కావాలని ముఖ్యమంత్రి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు, వాయు మార్గాలతోపాటు అంతర్గతంగా ఉన్న జలవనరుల్లో జల రవాణా ద్వారా సరకు రవాణాపై పని చేసేందుకు ముందుకు రావాలని లండన్లోని అరుప్ సంస్థను సీఎం కోరారు.
లండన్లోని ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ అల్తెరిన్, టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్ కంపెనీ సీఈఓ పూనమ్ గుప్తా, డబ్ల్యుఎంజి యూనివర్సిటీ నుంచి గౌరవ్ మార్వాహా, మాంఛెస్టర్ యూనివర్సిటీ నుంచి నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయా, ఏఐ పాలసీ ల్యాబ్స్ ఫౌండర్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజు, ఫ్లుయెంట్ గ్రిడ్ ప్రెసిడెంట్ రత్న గారపాటి, బ్రిటిష్ హెల్త్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి పాల్ బెంటన్ తదితరులు హాజరయ్యారు. ఏపీలోని టెక్నాలజీ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని సీఎం వివరించారు. అమరావతిలోనూ వచ్చే జనవరినాటికి ఏఐ క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభం కానుందని తెలిపారు. ఏపీలో ఏఐ వినియోగం, నిపుణుల తయారీవంటి అంశాలతోపాటు ఎకోసిస్టం అభివృద్ధికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీతపై వివిధ యూనివర్సిటీలు కూడా భాగస్వామ్యం వహించాలని తద్వారా వాటిని వెలికితీసి ప్రపంచ అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
	    	
 










