- ఆ దిశగా చొరవ చూపాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య
- సహకరించాలని మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి
న్యూఢిల్లీ (చైతన్య రథం): ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి లోకేష్కు అందజేశారు. బీసీలకు హక్కులు, అవకాశాల కోసం రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చినప్పటికీ వారి అభివృద్ధికి ఇంతవరకు నిర్మాణాత్మకమైన చర్యలు లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం 1953లో కాకాకలేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్ను నియమించారు. కమీషన్లు ఆయా కులాల విద్యా, వృత్తి, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి సిఫార్సులను సమర్పించాయి. కానీ, ఆ సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దేశంలో 70కోట్లకు పైగావున్న బీసీ జనాభా అభివృద్ధి చెందకపోతే భారత్ సూపర్ పవర్గా మారడం అసాధ్యం.
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నాయి. రాష్ట్రాలను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఇందుకోసం తెలుగుదేశం పక్షాన చొరవ చూపండి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా వత్తిడి తేవాలి.
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా వత్తిడి తేవాలి. బీసీ, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరించి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలుచేయాలి. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా సామాజిక భద్రతా చట్టాన్ని ఓబిసిలకు కూడా విస్తరించాలి. ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలుచేయాలి.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, నేషనలైజ్డ్ బ్యాంక్ చైర్మన్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల చైర్మన్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, కేంద్రస్థాయిలోని ఇతర బోర్డుల అధిపతుల నియామకాల్లో జనాభా ప్రకారం బీసీలకు 50శాతం కోటా కల్పించాలి. కేంద్రస్థాయిలో బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు, ఫీజు రీయింబర్స్మెంట్, పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లువంటి అనేక పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. విద్యారంగంలో బీసీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలి.
బీసీల సామాజిక, విద్య, ఆర్థికాభివృద్ధి, హాస్టళ్ల మంజూరు, వారి సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించేలా గళం విప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఐఐఎం, ఐఐటి వంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో కేంద్ర విద్యా సంస్థల్లో బిసిలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే ప్రవేశం పొందడానికి ఫీజు నిర్మాణం బాగా ఎక్కువగా ఉంది. ఇది ఒబిసి విద్యార్థులకు అందుబాటులో ఉండదు. జాతీయ విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థులకు ఫీజులు మంజూరు చేయడం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేసేలా చొరవ చూపాలని మంత్రి లోకేష్కు ఎంపీ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.