అమరావతి (చైతన్యరథం): దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లాకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శుభాంష్ శుక్లా, అతని బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ చారిత్రక ప్రయాణం భారత దేశానికి గర్వకారణం అని కొనియాడారు. ఈ మిషన్ కేవలం భారత అంతరిక్ష రంగంలో ఒక ముందడుగు మాత్రమే కాదు, ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో పెరుగుతున్న భారతదేశ ప్రాధాన్యతకు చిహ్నంగా అభివర్ణించారు.
గ్రూప్ కెప్టెన్ శుభాంశ్ శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మొదటి ఇస్రో అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారు. ఇది చారిత్రాత్మక ప్రయాణంగా నిలిచిపోతుంది. శుభాంశ్ శుక్లా ప్రయత్నం భారత అంతరిక్ష రంగంపైనే కాదు… ప్రపంచ అంతరిక్ష యాత్రల్లో తనదైన ముద్ర వేస్తుంది. శుభాంశ్ శుక్లాకు అతని టీమ్కు అభినందనలు. ఈ యాత్ర అన్ని విధాలుగా విజయవంతం కావాలి. ఈ అంతరిక్ష ప్రయాణం ధైర్యం, ముందుచూపు, ఎదురులేని నూతన భారత ఆత్మకు నిదర్శనంగా నిలుస్తుందని లోకేష్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ను ఇస్రో, నాసా, స్పేస్ ఎక్స్, యాక్సియం-4, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ట్యాగ్ చేశారు. అలాగే శుభాంశ్ శుక్లా ప్రయాణించిన అంతరిక్ష వాహనంతో కూడిన ఫోటోను కూడా మంత్రి లోకేష్ ఎక్స్లో షేర్ చేశారు.