అమరావతి (చైతన్య రథం): ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్లో కొత్త పురోగతి యుగం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సవాళ్లతో కూడిన భూభాగంలో రెండు కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోదీని అభినందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘చినాబ్ బ్రిడ్జ్.. ప్రపంచంలోనే ఎత్తయిన రైలు ఆర్చ్ వంతెన కాగా.. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను నిర్మించడం దేశానికి గర్వకారణం. ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని, జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నాను. వందేభారత్ రైళ్ల ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లో మాతా వైష్ణోదేవి కొలువైన కట్గానుంచి శ్రీనగర్ వరకు రైలు కనెక్టివిటీ అందుబాటులో ఉండటం సంతోషకరమైన విషయం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.