- సంపద సృష్టికి దారులు రహదారులే
- గడ్కరీ అంటే పట్టుదల, కృషి, వేగం, అంకితభావం
- గడ్కరీ… ఏపీనీ సొంత రాష్ట్రంగా భావించాలి..
- నేషనల్ హైవే ప్రాజెక్టులకు భూసేకరణలో సహకరిస్తాం
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన
- సీఎం కోరగానే రూ.26 వేల కోట్ల ప్రాజెక్టులకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్
- ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులకు ప్రామిస్
- రూ.2852 కోట్ల విలువైన ఎన్హెచ్ ప్రాజెక్టులు జాతికి అంకితం
- రూ.2381 కోట్ల విలువైన ఎన్హెచ్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
మంగళగిరి (చైతన్య రథం): సంపద సృష్టికి దారులు రహదారులేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రహదారుల నిర్మాణానికి దేశంతోపాటు.. ఏపీ సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. శనివారం కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రంలో మొత్తంగా రూ.5233 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ.. రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉదయం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు వేశాం. సాయంత్రం సంపద సృష్టికి మార్గమైన రహదారుల శంకుస్థాపన వంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా. అందుకే ఇది చరిత్రాత్మకమైన రోజు అని సీఎం అభివర్ణించారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో మరో రూ.26 వేలకోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గడ్కరీ ముందుంచారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి..
వేదిక మీదనుంచి ఆ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. ఇంతే కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా మరో రూ.లక్ష కోట్ల మేర ప్రాజెక్టులను ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి గడ్కరీ చేసిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రానికి మరింత సాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘గడ్కరీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఓ రూపం కల్పించారు. గడ్కరీ అంటే పట్టుదల, కృషి, వేగం, అంకిత భావం. గడ్కరీ మాటల్లో చేతల్లో అభివృద్ధి కన్పిస్తుంది. అభివృద్ధిని కోరుకునే వారు గడ్కరీ మాటలను సంగీతాన్ని ఆస్వాదించినట్టు ఆస్వాదిస్తారు. సహజంగా ఏ మంత్రి అయినా తన శాఖ గురించే ఆలోచిస్తారు. కానీ గడ్కరీ ఆలోచన విధానం అందరికీ భిన్నంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
గడ్కరీ రోడ్ల గురించే కాకుండా.. రోడ్లమీద జరిగే ప్రమాదాల నివారణ గురించీ ఆలోచన చేశారన్నారు. పొలూష్యన్ ఫ్రీగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్.. గ్రీన్ హైడ్రోజన్.. అది కూడా వ్యవసాయం ఉత్పత్తులనుంచే రావాలనే ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. నితిన్ గడ్కరీది రీసెర్చ్ మైండ్. ఎప్పుడూ ఏదో సాధించాలనే తపన ఆయనలో కన్పిస్తుంది. సాగరమాల.. భారతమాల వంటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. గతంలో నెల్లూరునుంచి తిరుపతి పోవాలంటే పది గంటలు పట్టేది. గుంతలమయంగా ఉండేది. కానీ ఇప్పుడా సమస్య తప్పింది. ప్రపంచంలో రోడ్ల ఇన్ఫ్రాలో దేశాన్ని నెంబర్-1 చేసే సామర్ధ్యం గడ్కరీకే ఉంది. గత ఐదేళ్లల్లో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని రోడ్లు శిధిలావస్థకు చేరాయి. కానీ జాతీయ రహదారులు మాత్రం బాగున్నాయి. 2014నాటికి ఏపీలో 4193 కిలోమీటర్లమేర జాతీయ రహదారులుండేవి. వాటిని 8745 కిలోమీటర్లకు చేర్చిన ఘనత గడ్కరీదే. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.11 వేల కోట్ల విలువైన 760 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తిచేశాం. ఈ ఏడాదిలో రూ.15 వేల కోట్ల విలువైన వేయి కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
జాతీయ రహదారుల ప్రాజెక్టులకు పూర్తిగా సహకరిస్తాం
‘‘జాతీయ రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా సహకరిస్తాం. నేషనల్ హైవేల నిర్మాణం కోసం భూసేకరణతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాం. రవాణ ఖర్చులు తగ్గించేలా గడ్కరీ కూడా ఆలోచన చేస్తున్నారు. అన్ని రకాల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఏపీకి వేయి కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలో మీటర్లకు ఓ పోర్టు ఉండాలి. ఇప్పటికే పోర్టులే కాకుండా.. త్వరలో ఇంకొన్ని పోర్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. రాబోయే కాలంలో హబ్ అండ్ స్పోక్ పద్దతిన రాష్ట్రంలో 20 పోర్టులను అందుబాటులోకి తెస్తాం. అలాగే ఎయిర్ పోర్టులు కూడా పెద్ద ఎత్తున నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతమున్నవి కాకుండా.. మరో 9 ఎయిర్ పోర్టులు నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. ఇది జరిగితే.. ఏపీ లాజిస్టిక్ హబ్ గా ఉంటుంది. భారత తూర్పు తీరానికి గేట్ వేగా ఉంటుంది. 2014-19 మధ్య కాలంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేశాం. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ వరకు జలరవాణకు పైలెట్ ప్రాజెక్టుతో చేపట్టాలని భావించాం. అలాగే బకింగ్ హ్యాం కెనాల్ ద్వారా కాకినాడ నుంచి చెన్నైకు కూడా జలరవాణ ప్రాజెక్టు అమలుకు సిద్దపడ్డాం. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టేశారు. మళ్లీ ఆ ప్రాజెక్టులను చేపట్టాలి. డ్రై పోర్టులు కూడా నిర్మించాలనే యోచన చేస్తున్నాం. రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. దీనికి కేంద్రం సపోర్ట్ కావాలి’’ అని చంద్రబాబు కోరారు.
గడ్కరీ స్పూర్తితో హైదరాబాద్ ఓఆర్ఆర్
గడ్కరీ మహారాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే 1977-78 కాలంలో ముంబైనుంచి పుణే వరకు పీపీపీ పద్ధతిన రహదారి నిర్మించారు. ఆ స్పూర్తితోనే నేను కూడా హైదరాబాదులోని ఓఆర్ఆర్ను పీపీపీ పద్ధతిన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 163 కిలోమీటర్లతో హైదరాబాద్ ఓఆర్ఆర్ నిర్మాణానికి నాడు రూపకల్పన చేశాం. ఇప్పుడు అమరావతికి 189 కిలోమీటర్లమేర ఓఆర్ఆర్ అడిగాం. దానికి అంగీకరించారు. ఏడు జాతీయ రహదారులను ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానిస్తోంది. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైళ్ల నిర్మాణం చేపడుతున్నాం. దీనికి కేంద్రం సహకరిస్తుంది అని చంద్రబాబు వెల్లడిరచారు.
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ గురించి గడ్కరీ చెప్పారు. ప్రతి ఇంటిపైనా విద్యుదుత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. పీఎం సూర్యఘర్, కుసుం పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. వికసిత్ భారత్.. స్వర్ణాంధ్ర జయప్రదం కావాలంటే.. రోడ్లు.. పోర్టులు.. ఎయిర్ పోర్టులు.. ఇన్ల్యాండ్ వాటర్ వేస్, రైల్వేల మీద శ్రద్ధపెట్టాలి. దక్షిణాదిలో అమరావతి-చెన్నై-బెంగళూరును కవర్ చేస్తూ బుల్లెట్ రైలు వేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఇది దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఐదు కోట్ల మందిని కవర్ చేస్తుంది. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయాలి. జాతీయ రహదారులకు రెండు వైపులా గ్రీనరీ పెంచేందుకు అవసరమైన నిధులివ్వాలి’’ అని చంద్రబాబు కోరారు.
మహారాష్ట్రతోపాటు ఏపీని మీ సొంత రాష్ట్రంగా భావించండి
‘‘కేంద్ర మంత్రి గడ్కరి మహారాష్ట్రతోపాటు ఏపీని సొంత రాష్ట్రంగా భావించాలి. మహారాష్ట్రకంటే ఎక్కువగా ఏపీనుంచి సహకారం అందిస్తాం. సమర్ధవంతమైన నాయకత్వం… దూరదృష్టి కలిగిన నేతగా మాకు సేవలు అవసరం. ఎంపీలు అడిగిన ప్రాజెక్టులన్నీ ఇచ్చారు. గడ్కరీ ఆలోచనలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
సీఎం అడిగిన వెంటనే గడ్కరీ మంజూరు చేసిన ప్రాజెక్టులివే..
హైదరాబాద్ -విజయవాడ ఆరు లేన్ల రోడ్డు -రూ.6700 కోట్లు
విజయవాడ -మచిలీపట్నం ఆరు లేన్ల రోడ్డు -రూ.2600 కోట్లు
వినుకొండ -గుంటూరు నాలుగు లేన్ల రోడ్డు – రూ.2605 కోట్లు
గుంటూరు -నిజాంపట్నం నాలుగు లేన్ల రోడ్డు -రూ.2000 కోట్లు
బుగ్గకయిప -గిద్దలూరు నాలుగు లేన్ల రోడ్డు -రూ.4,200 కోట్లు
ఆకివీడు -దిగమర్రు నాలుగు లేన్ల రోడ్డు -రూ.2500 కోట్లు
పెడన -లక్ష్మీపురం నాలుగు లేన్ల రోడ్డు -రూ.4,200 కోట్లు
ముద్దునూరు -కడప నాలుగు లేన్ల రోడ్డు -రూ.1182 కోట్లు
హైదరాబాద్ -విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేశారు.