- యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసింది
- యోగాతో గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు
- 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం వరల్డ్ రికార్డ్
- 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు
- ప్రధాని మోదీకి కానుకగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
- ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా
- చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ స్థాయికి
- విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్యరథం): ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు.. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసింది.. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ నెల 21న, శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో శుక్రవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించేలా 25 వేల మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..ఈ రోజు గిరిజన విద్యార్థులను చూస్తుంటే తనకు గుర్తుకువచ్చేది కమిట్మెంట్, పట్టుదల అన్నారు. 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు మీరు చేసినప్పుడు మేం అందరం ఆశ్చర్యపోయాం. ఒక్క పిలుపుతో మీరంతా కష్టపడి దేశంతో పాటు ప్రపంచం మనవైపు చూసేలా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
వరల్డ్ రికార్డ్
ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు మన గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దాదాపు 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం వరల్డ్ రికార్డ్. దీనిని శనివారం అధికారికంగా ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ ప్రధాని మోదీ తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని, ఎన్నడూ జరగని విధంగా చేసి చూపిస్తామని ప్రధానిని మన ముఖ్యమంత్రి కోరారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా 5 లక్షల మంది శనివారం జరిగే యోగాంధ్రలో పాల్గొని గిన్నీస్ రికార్డ్ సృష్టించబోతున్నారని మంత్రి లోకేష్ ప్రకటించారు.
చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ స్థాయికి
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు మా నాన్న చంద్రబాబు నాతో యోగా చేయించేవారు. ఉదయమే మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను. అదే క్రమశిక్షణ, పట్టుదల మీ అందరిలో ఉంది. దీనిని మరువొద్దు. ఏ ఆశయాల కోసం మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాల కోసం నడవండి. విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. మనం అందరం కలలు కనాలి. మన కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశాన్ని మార్చాలనే కలలు కనాలి. అందుకోసం కష్టపడి పనిచేయాలి. పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయం పెట్టుకున్నామో దానిని సాధించాలని కోరుతున్నా. ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతమయ్యేలా కృషి చేసిన మంత్రి సంధ్యారాణిని సభాముఖంగా అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. విద్యార్థులు పట్టుదలతో సూర్యనమస్కారాలు చేయటంతో.. మా అందరిపై బాధ్యత మరింత పెరిగిందని మంత్రి లోకేష్ అన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా
జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని కూడా నేను అభినందిస్తున్నా. ఏడాది కాలంగా విద్యార్థులతో అద్భుతంగా ప్రాక్టీస్ చేయించారు. మాస్టర్ కూడా పట్టుదలతో శిక్షణ ఇచ్చారు. ఈ రోజు విద్యార్థులు చరిత్ర సృష్టించారు. ఇందుకు విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు అని మంత్రి లోకేష్ అన్నారు.
మోదీకి కానుకగా గిన్నీస్ రికార్డ్ ఇచ్చాం
ఆంధ్రులుగా మన కోరికలన్నీ ప్రధాని మోదీ తీరుస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపారు. విశాఖకు రైల్వే జోన్ కోరితే ఇచ్చారు. ఆగిన ప్రజారాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్టీపీసీ లాంటి సంస్థలు కావాలని అడిగితే ఇచ్చారు. ఏపీ అన్నా, విశాఖ అన్నా ప్రధానికి చాలా ప్రేమ. ఏడాదిలో రెండోసారి ప్రధాని విశాఖ వస్తున్నారు. ఆయనకు ఒక కానుకగా మనం అందరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మంత్రి లోకేష్ చెప్పారు.
దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడు
మిమ్మల్నందరినీ చూస్తుంటే మా అబ్బాయి దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడు. మీ అందరిలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదలను దేవాన్ష్కు నేర్పించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ ఇచ్చిన ఆదేశాలను క్రమశిక్షణ, పట్టుదలతో పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, దేశానికే దిశానిర్దేశం చేసినందుకు మంత్రి లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సీఎస్ విజయానంద్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎం.టి కృష్ణబాబు, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.