- బడిపిల్లలను రాజకీయ నిరసనలకు తీసుకెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
- అనుమతించిన ఎంఈవో, హెచ్ఎం
- తిరిగొస్తుండగా ప్రమాదంలో ఏడుగురు పిల్లలకు గాయాలు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్స్లో ఒక వ్యక్తి పోస్ట్
- వెంటనే స్పందించిన మంత్రి లోకేష్
- నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
- విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టీకరణ
- లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక
అమరావతి (చైతన్యరథం): సామాజిక మాధ్యమం ఎక్స్లో విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఎంతో చురుగ్గా ఉంటారు. ఎక్స్లో వచ్చే పోస్టులపై వెంటనే స్పందిస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఓ సామాన్యుడు చేసిన పోస్ట్కు తక్షణం స్పందించారు. పార్వతీపురం జిల్లాలోని ఓ స్కూల్లో జరిగిన విషయాన్ని శ్యామ్ అనే వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యార్థులను వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరసనకు తీసుకెళ్లారని.. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారని మంత్రికి తెలిపారు శ్యామ్. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్ట్పై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బడి పిల్లలను ధర్నాకు తీసుకెళ్లటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణం, నేరం. అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించా. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా మంత్రి లోకేష్ రీ పోస్ట్ చేశారు.
శ్యామ్ పోస్ట్ ఇదే..
గౌరవనీయులైన విద్యాశాఖా మంత్రి లోకేష్కు.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్గా.. ఎంఈవో, హెచ్ఎం కూడా ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. ఎంఈవో, హెచ్ఎం బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను ఫణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం. ఈ సంఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులైన ఎంఈవో, హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేం. త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ శ్యామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.