- ఏజెన్సీలు ‘పొడి చెత్త’ను సేకరించేలా త్వరలో టెండర్లు
- అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- ‘సర్క్యులర్ ఎకానమీ పాలసీ’ రూపొందించాలని నిర్దేశం
అమరావతి (చైతన్య రథం): వ్యర్ధాల సమర్ధ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతీరోజూ ఇళ్లనుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్ట్గా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ, అలాగే జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి… చెత్తను గ్రేడిరగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో, లేదా అక్కడనుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదన్నారు. సర్క్యులర్ ఎకానమీపై గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు.
‘జీరో వేస్ట్’ ప్రభుత్వ విధానం
‘జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలి. ప్రతి పంచాయతీలో అమలయ్యేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. స్వచ్ఛాంధ్రప్రదేశ్, కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేసి చెత్తను కలెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలి. వ్యవసాయ వ్యర్ధాలతోపాటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్ధాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలి. ‘సర్క్యులర్ ఎకానమీ పాలసీ’ రూపొందించాలి. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్ మోడల్ను పరిశీలించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.