- మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న మంత్రి
- గురువైభవోత్సవాలు, పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి
- మంత్రి లోకేష్ని సత్కరించిన మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు
కర్నూలు (చైతన్యరథం): రాయలసీమ నుంచి వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శనివారం మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్రస్వామి. స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలి. ఇందుకోసం అహర్నిశలు కృషిచేస్తాం. రాయలసీమ నుంచి వలసలు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్నాను. ప్రజలు, దేవుని ఆశీస్సులు మాకు ఉండాలని అన్నారు. పట్టాభిషేక మహోత్సవం అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారు మంత్రి లోకేష్ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్కు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు.
రథోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
పట్టాభిషేక మహోత్సవం అనంతరం ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, అశేష భక్త జనసందోహం మధ్య రథాన్ని లాగారు. శ్రీ రాఘవేంద్రస్వామి నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రాలయం స్కూల్ గ్రౌండ్ కు చేరుకున్న మంత్రి లోకేష్కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.