- అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణం
- దేశ సముద్ర సాంకేతికత, తీర భద్రత, బ్లూ ఎకానమీలో నూతన అధ్యాయం మొదలైంది
- జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా 25వేల మత్స్యాకార కుటుంబాలకు లబ్ది
- ఈ ప్రాజెక్ట్ ద్వారా మత్స్యకారుల ఉత్పాదకత పెరుగుతుంది
- ఎలాంటి అపోహలకు గురికావద్దు, మత్స్యకారులను చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది
- నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
నెల్లూరు (చైతన్య రథం): మారిటైం ఇన్నోవేషన్, అటానమస్ సిస్టమ్స్ గ్లోబల్ హబ్గా ఏపీ రూపుదిద్దుకుంటుంది. అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణం. దేశ సముద్ర సాంకేతికత, తీర భద్రత, బ్లూ ఎకానమీలో నూతన అధ్యాయం ప్రారంభమైందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించనున్న అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “దేశంలోనే తొలి అటానమస్ మెరైన్ షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణం. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కేవలం ఒక కొత్త పరిశ్రమ ప్రారంభం మాత్రమే కాదు. భారతదేశ సముద్ర సాంకేతికత, తీర భద్రత, బ్లూ ఎకానమీకి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. భారతదేశం ఒక సముద్ర దేశం. మన దేశానికి 7,500 కిలోమీటర్లకు పైగా తీరరేఖ ఉంది. ఏపీకి దేశంలో రెండో పొడవైన తీరరేఖ ఉంది. మనకు సముద్రం అంటే.. అదో జీవనోపాధి, వాణిజ్యం, సంస్కృతి, అవకాశాల కేంద్రం. మన తీరప్రాంత జిల్లాల్లో లక్షలాది కుటుంబాలు తమ జీవనోపాధి కోసం సముద్రంపై ఆధారపడుతున్నాయి. మన మత్స్యకారులు ప్రతిరోజు అనిశ్చితమైన సముద్రంలోకి వెళ్లి, తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు ఆహారం అందిస్తున్నారు. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నారు. అందుకే తీరప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి, సముద్ర భద్రత, మత్స్యకారుల కోసం సాంకేతికత మనకు అత్యంత ముఖ్యమైనవి. ఈ రోజు ప్రారంభమవుతున్న ప్రాజెక్ట్ వాటిని సాకారం చేస్తుంది” అని లోకేష్ పేర్కొన్నారు.
25వేల మత్స్యాకార కుటుంబాలకు లబ్ది
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను రూ.288.80 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ హార్బర్లో ల్యాండింగ్ ప్లాట్ఫామ్లు, వేలం హాళ్లు, వలల మరమ్మతు యార్డ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్, తాగునీటి సదుపాయంతో పాటు చేపల నిర్వహణ సదుపాయాలువంటి ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హార్బర్ ద్వారా 25వేల మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. సుమారు 1,250 మెకనైజ్జ్, మోటరైజ్డ్ చేపల పడవలను సురక్షితంగా నిలిపే సదుపాయం కల్పించాం. ప్రతి ఏడాది ఈ హార్బర్ ద్వారా 41 వేల టన్నుల చేపలు దిగుబడి జరుగుతోందని అంచనా. దీనివల్ల నెల్లూరు జిల్లాలో మత్స్య ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అయితే ఇక్కడ భద్రత అనేది చాలా ముఖ్యం. తుఫానులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో మన మత్స్యకారులు సముద్రంలో భారీ ప్రమాదాలను ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లో ఈ హార్బర్ సేఫ్ షెల్టర్లా పనిచేస్తుంది. మత్స్యకారులు తమ కష్టంతో కొనుగోలు చేసిన పడవలు, ఇంజన్లు, వలలువంటి ఆస్తుల పరిరక్షణకు సహాయపడుతుంది. మత్స్యకార కుటుంబాలకు పడవ అంటే కేవలం పరికరం కాదు.. అది వారి జీవనోపాధి. ఆ జీవనోపాధిని కాపాడటం మన బాధ్యత” అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు
“జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పక్కనే భవిష్యత్ దిశగా అడుగువేసే మరో ప్రాజెక్ట్కు నేడు శంకుస్థాపన చేశాం. 29.58 ఎకరాల విస్తీర్ణంలో సాగర్ ఢిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మిస్తోంది. ఈ కేంద్రంలో ఆధునిక సముద్ర సాంకేతికతలను రూపకల్పన చేసి తయారు చేస్తారు. మనుషుల్లేని సముద్ర ఉపరితల నౌకలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, ఏఐ ఆధారిత సముద్ర పర్యవేక్షణ వ్యవస్థలు, నావిగేషన్ సాంకేతికతలను రూపొందించనున్నారు. ఇవి తీరప్రాంత పర్యవేక్షణ, పోర్ట్ భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, సముద్ర రక్షణ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. సముద్ర భద్రత ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. తీర పర్యవేక్షణ, సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం” అని లోకేష్ వివరించారు.
మత్స్యకారుల ఉత్పాదకత పెరుగుతుంది
“ఇక్కడ అభివృద్ధి చేస్తున్న అటానమస్ మారిటైం సిస్టమ్స్.. మన జలాలను సంరక్షించడంతోపాటు పోర్టుల భద్రత, దేశాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతోపాటు ఈ సాంకేతికతలు మన మత్స్యకారులకు కూడా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఇవి మత్స్యకారులకు రియల్ టైంలో వాతావరణ సమాచారం, చేపల గుర్తింపు, నేవిగేషన్ సహాయంవంటి సేవలను అందిస్తాయి. దీంతో సముద్రంలో భద్రత పెరుగుతుంది, ఇంధన వ్యయం తగ్గుతుంది, మత్స్యకారుల ఉత్పాదకత పెరుగుతుంది. సాంకేతికత రక్షణ కోసం మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి కూడా దోహదపడాలి” అని లోకేష్ అన్నారు.
మత్స్యకారులను చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది
“మత్స్యకారులను చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఈ ప్రాజెక్ట్పట్ల మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుతమైన మారిటైం కంపెనీని తీసుకువచ్చాం. వీరు ఓవైపు డిఫెన్స్ పరికరాలు తయారుచేస్తూ.. మనకు కూడా అండగా నిలబడతారు. మన సంపద, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సహకారం అందిస్తారని మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. మత్స్యకార కుటుంబాల్లోని యువతలో అపార నైపుణ్యాలున్నాయి. ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంస్థను కోరుతున్నా” అన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా బలం
“రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో మూడు బలమైన కారణాలున్నాయి. మొదటిది చంద్రబాబు బ్రాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయత, దూరదృష్టి పరిశ్రమలతో దీర్ఘకాల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏపీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు. ప్రభుత్వ ప్రాజెక్ట్ అవుతుంది. త్వరితగతిన పెట్టుబడి సాకారం అయ్యేలా చూస్తాం. మూడో కారణం.. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా, సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నమో అంటే నాయుడుజీ, మోదీజీ కలయిక” అన్నారు.
మారిటైం ఇన్నోవేషన్, అటానమస్ సిస్టమ్స్ గ్లోబల్ హబ్గా ఏపీ
“సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థకు భారత్ బయోటెక్ కీలక పెట్టుబడిదారుగా మద్దతిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంజనీర్లు, సముద్ర సాంకేతిక నిపుణులు, రోబోటిక్స్ నిపుణులు, యువ ఆవిష్కర్తలకు అధిక నైపుణ్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సముద్ర సాంకేతికతలో పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తుంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, అటానమస్ మారిటైం షిప్ యార్డ్ ఈ ప్రాంతాన్ని మత్సరంగం, సముద్ర సాంకేతికతకు ప్రధాన కేంద్రంగా మార్చబోతున్నాయి. తీర భద్రతను బలోపేతం చేస్తుంది. మత్స్యకారుల జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ను మారిటైం ఇన్నోవేషన్, అటానమస్ సిస్టమ్స్ గ్లోబల్ హబ్గా నిలుపుతుంది. ఈరోజు జరిగిన శంకుస్థాపన కేవలం ఒక నిర్మాణానికి ప్రారంభం మాత్రమే కాదు.. నూతన వ్యవస్థకు ఆరంభం. ఈ ప్రాజెక్ట్ను సాకారం చేసిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, భారత్ బయోటెక్, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డ్, ఇతర భాగస్వాములకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఏ అవసరం వచ్చినా వాట్సాప్ మెసేజ్ దూరంలో ఉంటా”నని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చిన స్థానిక మత్స్యకారులను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.
కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, పి.సునీల్ కుమార్, ఎన్.విజయశ్రీ, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్, సీహెచ్ ఆర్వో సన్యుక్తా సింగ్, ఆర్కేపీ సింగ్, ఏపీ మారిటైం బోర్డు సీఈవో అభిషేక్ కుమార్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.














