- తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ క్లియరెన్స్
- భూకేటాయింపులపై సబ్కమిటీ ప్రతిపాదనలకు ఓకే
- వర్కింగ్ ఉమెన్ కోసం మిషన్ శక్తికింద ‘సఖీ నివాస’లు
- సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రిమండలి భేటీ
- అజెండాలోని అంశాలను చర్చించి ఓకే చేసిన కేబినెట్
- మంత్రుల పనితీరుపై సీఎం దిశానిర్దేశం
- ఎల్పీజీ కొరత అధిగమించేందుకు నిరంతర పర్యవేక్షణ
- ఏప్రిల్ 2న శాఖల పనితీరుపై నివేదికలివ్వనున్న సీఎం
- వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి
- మార్చి 16న అన్ని జిల్లాల్లో అమరజీవి జయంత్యుత్సవాలు
- నీటిపన్ను వసూలుపై జలవనరుల శాఖకు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): సచివాలయం, హెచ్డీ టవర్ల నిర్మాణాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ నిర్ణయాలు
రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం.
రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆమోదం.
300మంది హెడ్ కానిస్టేబుళ్ల పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు ఆమోదం.
చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17 వేలమందికి ఉపాధి లభించేలా చర్యలు.
3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్లు ఆర్థిక వనరులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.
ఎసఆరఎ పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.
మిషన్ శక్తి కింద ‘ సఖీ నివాస’ పేరిట పనిచేసే మహిళల కోసం క్రెచ్ సౌకర్యాలతో హాస్టళ్లు.
తిరుపతి, విజయవాడ, విశాఖ అప్పీల్ కార్యాలయాల పరిధిపై నిర్ణయం.
ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట గెజిట్కు ఆమోదం
పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం.
పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు రూ.3.47 కోట్లు కేటాయింపు.
పోలవరం ప్యాకేజ్-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి.
ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో అత్యవసర మరమ్మతు పనులకు నిధుల మంజూరు.
క్యాబినెట్లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ అంశాలపై సీఎం చర్చించారు. గ్యాస్ కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కొందరు గ్యాస్కు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎలక్ట్రిక్ స్టవ్లతో విద్యుత్ డిమాండ్ పెరగడంతో పరిస్థితి పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఏప్రిల్ 2న శాఖల పనితీరుపై నివేదికలు ఇస్తానని, వాటి ఆధారంగా సమీక్ష చేసుకొని పురోగతి సాధించాలని సూచించారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 ఏడాదిలో పని తీరు మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నివేదికలో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధులు వినియోగం, పథకాల అమలువంటి అంశాలు రహస్య నివేదికలో ఉంటాయని ఆయన వివరించారు.
ఏప్రిల్ 2 నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం చేపట్టాలన్నారు. కాలువలు, డ్రెయిన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలను పెంచాలన్నారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. చివరి ఎకరానికి కూడా నీరిచ్చేలా జలధార కార్యక్రమం జరగాలని సీఎం ఆదేశించారు. అందుకు రైతులను ముందస్తుగా సమాయత్తం చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. వెలుగొండ ఫేజ్-1 ఈ ఏడాది జూన్నాటికి పూర్తి చేస్తామన్నారు. కృష్ణా నది కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్ట పరచాలని ఆదేశించారు.
ఎన్నిక ఏదైనా గెలుపు మనదేకావాలి..
ఆంధ్రప్రదేశ్లో మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మార్చి 16న అన్ని జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతున్న వేళ.. ప్రజలు ఇబ్బంది పడకుండా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఉంటారన్నారు.
పంచాయతీలు మాదిరిగా జలవనరుల శాఖ కూడా నీటి పన్ను వసూలు చేయాలని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సీఎం సూచించారు. మీరు చేసిన పనిని.. మీడియాకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వాన్ని స్థిరత్వానికి తీసుకువచ్చామని, ఇక ఇప్పుడు టేక్ ఆఫ్ చేయాలని తెలిపారు. అందరూ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని.. అప్పుడు మాత్రమే శాఖల్లో లక్ష్యాన్ని చేరుకుంటారని మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.















