- ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకున్న సీఎం
- మహిళా ఉత్పత్తుల ‘స్వయం ఏపీ’ లోగో ఆవిష్కరణ
- మహిళా సంఘాలు రూపొందించిన ‘స్వయం’ ఉత్పత్తులే వాడాలి
- వచ్చే ఏడాదికి 5 లక్షలమందిని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం
- వెలుగు 2.0 కిందకు సెర్ప్, మెప్మా సంస్థలు
- పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు చర్యలు
- ఎస్జీహెచ్లకు రూ.10.1వేల కోట్ల మెగా చెక్కు అందజేత
- అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, (చైతన్య రథం): ఈ ఏడాదిలో మరో 5 లక్షలమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ప్రకటించారు. నిరుడు చెప్పినట్టే ఏడాదిలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, వచ్చే ఏడాదికి దేశంలో 6 లక్షలమంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్న రాష్ట్రం ఏపీనే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటినుంచి ఒక ఎంఎసఎంఈ ఉండాలని, అందులో 50 శాతం మహిళలే ఉండాలన్నది తన ఆకాంక్షగా వివరించారు.అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినులతో కలిసి ముఖ్యమంత్రి ర్యాంప్వాక్ చేస్తూ మహిళలకు అభివాదం చేశారు. అనంతరం స్వయం సహాయ సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి ‘స్వయం ఏపీ’ లోగోను ఆవిష్కరించారు. ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. 6,81,506 మంది మహిళలకు వివిధ విభాగాల నుంచి సబ్సిడీతో ఇచ్చే రూ.10,100 కోట్ల రుణాల మెగా చెక్కును అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
మహిళలే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు
‘తెలుగింటి ఆడపడుచులకు, దేశంలోని ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు. స్త్రీలను ఆరాధించి, పూజించిన చోట సంపదకు లోటు ఉండదు. ముఖ్యమంత్రిగానే కాదు..వ్యక్తిగతం గానూ ఆడబిడ్డలనూ అభిమానిస్తా. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి హక్కులు, న్యాయం, చర్యలు అనే కొత్త థీమ్ని ప్రవేశపెట్టారు. మహిళా హక్కులు కాపాడటం, చట్టపరంగా న్యాయం చేయడం, వారి ఉన్నతికి చర్యలు తీసుకోవడం ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేలా థీమ్ను తీసుకున్నాం. మంత్రివర్గంలో ముగ్గురు మహిళా మంత్రులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. దేశ అధ్యక్షురాలిగా ఒక గిరిజన మహిళ ఉన్నారు. దేశ ఆర్థికమంత్రి కూడా మన ఆడ పడుచే. ఏటా బడ్జెట్ను సమర్థవంతంగా ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ రూపకల్పనకు మారుపేరు మహిళలు. కుటుంబానికి వచ్చిన ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగించే మన మహిళలే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు. త్వరలో ఏపీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ కూడా మహిళే రాబోతున్నారు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
మహిళా సాధికారతకు బాటలు వేసింది ఎన్టీఆర్
‘కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికే పనిచేస్తోంది. 2019-2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగి తీవ్రంగా నష్టపోయాం. పేదలకు న్యాయం చేయాలి, డ్వాక్రా, మెప్మా సంఘాలకు పూర్వ వైభవం తేవాలని కూటమిగా ఏర్పడ్డాం. మహిళలకు శక్తి సామర్ధ్యాలను ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. మహిళల పేరుపైన మీద ఇంటి స్థలాలు, రుణాలు, సంక్షేమ పథకాలను ఇస్తున్నాం. మొదటగా ఆడబిడ్డలకు న్యాయం చేసింది ఎన్టీఆరే. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలా సమాన హక్కు ఇచ్చారు. విద్యలో మహిళలను ప్రోత్సహించేందుకు పద్మావతీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దానికి కొనసాగింపుగా కళాశాలల్లో, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాను. చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయి. ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు దీనికి సిద్ధంగా ఉండాలి. మహిళకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు పెడితే కొందరు వ్యతిరేకించారు. అయినా ఆడబిడ్డలు పైకి రావాలనే ఉద్దేశంతో ముందుకెళ్లాను. మగవాళ్ల కంటే ఎక్కువ ఆదాయం మహిళలు ఆర్జిస్తున్నారు. 1997లో ఆడబిడ్డ పుడితే భారమనే రోజుల్లోనే ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం తెచ్చి రూ.5 వేలు డిపాజిట్ చేశాం. స్కూల్కు వెళ్లే 8, 9,10 తరగతి విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాను’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
స్త్రీశక్తి ద్వారా ఇప్పటికి 50 కోట్ల బస్సు ప్రయాణాలు
డ్వాక్రా, మెప్మా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. గృహ హింసపై డ్వాక్రా సంఘాల్లో చర్చ జరగాలి. ప్రతీ ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత స్వయం సహాయక సంఘాలది. ఎంతమంది బిడ్డలున్నా తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇచ్చి మహిళల్ని గౌరవించాం. స్త్రీశక్తి పథకంతో బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికి 50 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. దీపం పథకంతో మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తున్నాం. అమెరికా-ఇరాన్ యుద్ధం మన మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగినా ఆడబిడ్డలకు ఉచితంగానే అందిస్తాం. గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తామని చెప్పాం. ఇప్పటికి 1,12,686 మంది మహిళలు ఎంఎసఎంఈలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా సభ్యులు, మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తారని, దీనివల్ల బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయి’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
‘స్వయం’ బ్రాండ్లకు నేనే బ్రాండ్ అంబాసిడర్
‘ప్రతీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని సంకల్పించాం. మన ఆడబిడ్డలు ఏదైనా మంచి పని కోసం సంకల్పం తీసుకున్నారంటే అది సాధించే వరకు వదలరు. ‘స్వయం ఏపీ బ్రాండ’ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. డ్వాక్రా సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మహిళలే వినియోగించుకోవాలి. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది ఉన్న డ్వాక్రా సభ్యుల ఇళ్లలోని 3.30 కోట్ల మంది వినియోగించుకుంటారు. మన బ్రాండ్లు బాగుంటే ప్రపంచమే మన దగ్గరకు వస్తుంది. స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. దేనికైనా బ్రాండ్, నాణ్యత చాలా ముఖ్యం. మంచి బ్రాండ్ ఉంటే తీసుకుంటారు. కావాల్సిన యంత్ర పరికరాలు ఇప్పించే బాధ్యత నాది. సొంత ఊర్లోనే కూర్చుని ఉత్పత్తులు తయారు చేసే బాధ్యత మహిళలది. మీ ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించే బాధ్యత తీసుకుంటాము. డ్వాక్రా మహిళల స్వయం బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. మహిళా పారిశ్రామికవేత్తలుగా నా భార్య, కోడలు సమర్థవంతంగా రాణిస్తున్నారు. హెరిటేజ్ నుంచి వస్తున్న సంపాదనతో నేను, లోకేష్ గౌరవంగా రాజకీయాలు చేస్తున్నాం. వారిలాగే ప్రతీ ఇంట్లోని ఆడబిడ్డ పారిశ్రామిక వేత్తలుగా ఉండాలనేది నా ఆకాంక్ష. వెలుగు ప్రాజెక్టు కిందకు సెర్ప్, మెప్మాలను తీసుకొస్తాం’ అని సీఎం ప్రకటించారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సురక్షితం
‘మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. మహిళా అభివృద్ధి కోసం ఓ బ్లూ ప్రింట్ రూపొందించాం. ప్రతీ ఇంటి నుంచి ఎంఎసఎంఈలు ఆవిష్కృతం కావాలి. అందులో 50 శాతం మంది మహిళలే ఉండాలన్నది నా కోరిక. మహిళా సంఘాలు, ఎంఎసఎంఈలు తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్లాలి. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన స్వయం బ్రాండ్ను ప్రతిష్టాత్మక బ్రాండ్గా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడతాం. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేందుకు పీ4 విధానం తీసుకొచ్చాం. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. గత పాలనలో రాష్ట్రమంతా గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను తయారుచేశారు. మహిళలకు రక్షణ కరవైంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. గంజాయి బ్యాచ్కు మహిళలు బుద్ధి చెప్పాలి. ఆరోగ్యం విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. సర్వైకల్, బ్రెస్ట్ కాన్సర్లు వస్తున్నాయి. విరివిగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది’ అని సీఎం అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి కుటుంబమే అతిపెద్ద సంపద
‘మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మన దేశానికి ఉమ్మడి కుటుంబాలే అతిపెద్ద సంపద. రేషన్, పెన్షన్, ఇంటి కోసం కుటుంబం విడిపోకూడదు. కుటుంబం వల్ల మనకు భద్రత వస్తుంది. పెద్ద వయసులో తల్లితండ్రులు ఒంటరిగా ఉండిపోతున్నారు. వృద్ధాప్య రేటు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి మారాలి. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. అదనంగా పెన్షన్, కుటుంబాన్ని బట్టి డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 60 కేజీల వరకూ రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. 58 శాతం మంది ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారు. కొందరు అసలు వద్దనుకుంటున్నారు. అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఇద్దరు పిల్లలుంటే మహిళలకే కాకుండా మగవారికీ రెండు నెలలపాటు మెటర్నిటీ సెలవులిస్తాం. రాష్ట్రంలో ఆదాయం పెరగాలంటే అభివృద్ధి జరగాలి. అది సుపరిపాలనతోనే సాధ్యం’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కార్యక్రమంలో మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చారు.













