విశాఖ తీరంలో భారత నౌకాదళ మహా ప్రదర్శన
హాజరైన సర్వసైన్యాధిపతి ద్రౌపదీ ముర్ము
ఫ్లీట్ రివ్యూలో యుద్ధ నౌకలనుంచి వందన స్వీకారం
రాష్ట్రపతివెంట గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు
సహచరితో కలిసి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్
ఐఎనఎస్ సుమేధపై ప్రయాణం
ప్రత్యేక ఆకర్షణగా భారత మిత్రదేశాల నౌకల ఫ్లీట్
విశాఖపట్నం (చైతన్య రథం): అనంత సాగర జలాలలో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఘట్టం విశాఖ మహానగరం వేదికగా అట్టహాసంగా సాగింది. ఒకేసారి మూడు ఉత్సవాలు (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026, మిలాన్-2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం) ఇంత పెద్దఎత్తున నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘సాగర జలాల్లో స్నేహ వారధుల బలోపేతం’ అన్న నినాదంతో జరుగుతున్న వేడుకలకు భారత సర్వ సైన్యాధిపతి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. కేవలం యుద్ధ నౌకలు, పాటవాల ప్రదర్శనకే పరిమితం కాకుండా దేశాల మధ్య స్నేహం, సహకారానికి ప్రతీకగా ఈ ఫ్లీట్ నిలిచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ బలమైన శక్తి అని చాటిచెప్పేలా వేడుకల సందర్భంగా స్నేహపూర్వక దేశాలన్నీ ఒకేచోట చేరాయి. వీటిద్వారా ప్రపంచ శాంతి, సముద్ర భద్రతకు కొత్తదారులు వేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అట్టహాసంగా సాగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్)లో ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ఐఎనఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బందినుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ.. తదితర దేశాలనుంచి 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ప్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. అంతకుముందు విశాఖపట్నం తీరంలో నౌకాదళ అధికారులు అందించిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతితోపాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధ నౌకల విన్యాసాలను వీక్షించారు.
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో దాదాపు భారత్నుంచి 71 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, కోస్ట్ గార్డు నౌకలు పాల్గొన్నాయి. అలాగే 20 దేశాలనుంచి వచ్చిన మరికొన్ని నౌకలు సైతం రివ్యూలో పాల్గొన్నట్టు నౌకాదళ అధికారులు వెల్లడించారు. కాగా అంతర్జాతీయ నౌకల సమీక్షను చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించడం విశేషం. భారత నౌకాదళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఐఎఫఆర్Y-2026 సాగింది. ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎనఎస్ విక్రాంత్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించి పాక్ను వణికించిన విక్రాంత్ ఇప్పుడు విశాఖ తీరంలో ప్రపంచ దేశాలకు తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించేందుకు విచ్చేసింది. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల పాల్గొన్నారు.
నేడు పరేడ్
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో అమెరికా, రష్యా పాల్గొంటుండగా.. జర్మనీ, ఫిలిప్పీన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తొలిసారిగా యుద్ధనౌకలు హాజరయ్యాయి. చైనా, టర్కీ, పాక్ దేశాలను భారత్ ఆహ్వానించలేదు. ఐఎఫఆర్-2026, మిలన్-2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు అతిధ్యమిస్తున్న విశాఖనగరంలో నౌకాదళ సత్తా అందరికీ తెలిసేలా నేటి సాయంత్రం ఆర్కే బీచ్లో పరేడ్ జరగనుంది. ఇందులో 8వరకు విదేశీ నావికా బ్యాండ్లు పాల్గొంటాయి. 45 బృందాలు పరేడ్లో భాగస్వామ్యమవుతాయి. ఈ సందర్భంగా జరిగే సాహస విన్యాసాల ప్రదర్శన కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు ముమ్మర కసరత్తు చేశాయి. కమోవ్, ధ్రువ్, సీ కింగ్ హెలికాప్టర్లు, డార్నియర్, హాక్, మిగ్-29కే నౌకాదళ యుద్ధ విమానాలు ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తాయి. చేతక్ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ చేపడతాయి. ఈ పరేడ్కు అనుబంధంగా యుద్ధ నౌకలపై నేవీ సెయిలర్స్ విన్యాసాలు నిర్వహిస్తారు.
దశాబ్దం తరవాత..
విశాఖలో మిలన్ విన్యాసాలు పదేళ్ల తర్వాత జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా నగరవాసులు మిలన్పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి మిలన్కి భారత్ అధ్యక్షస్ధానంలో బాధ్యతలను నిర్వర్తిస్తుండగా 65దేశాలు పాల్గొంటున్నాయి. మిలన్ విలేజ్లో మిలన్, ఐఎఫఆర్కు సంబంధించిన టోపీలు, బ్యాగులు, కొయ్య బొమ్మలు, మట్టి కుండలు, రుచికరమైన వంటల స్టాల్స్, చేనేత, హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈనెల 21 వరకు మిలన్ విలేజ్ కొనసాగుతుంది. ఈనెల 21నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్లో భాగంగా విదేశీ యుద్ధ నౌకలు, భారత నౌకాదళం కలిసి బంగాళాఖాతం మధ్యలో రకరకాల విన్యాసాలు నిర్వహిస్తాయి.
హిందూ మహా సముద్రం, పసిఫిక్ ప్రాంతానికి చెందిన నౌకాదళాల చీఫ్లు, ఉన్నతాధికారులు పాల్గొనే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ఈనెల 20న విశాఖలోనే నిర్వహిస్తారు. దీనికీ 65 దేశాల నేవీ ప్రతినిధులు హాజరవుతారు. పరస్పర సహకారం, అభివృద్ది, సాంకేతిక మార్పిడివంటి వాటిపై చర్చించనున్నారు. ఈనెల 21నుంచి 25వరకు బంగాళాఖాతంలో మిలన్ 2026 సీఫేజ్ విన్యాసాలు పూర్తి చేసుకుని విదేశాలనుంచి వచ్చిన యుద్ధ నౌకలు ఆయా దేశాలకు పయనమవుతాయి. మన నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు కూడా ఈ సీఫేజ్ తర్వాత తమ తమ స్థావరాలకు చేరుకుంటాయి.














