- జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు బాలలు దూరం
- గత ప్రభుత్వ వైఫల్యాలకు అదే నిలువుటద్దం
- వన్ క్లాస్ -వన్ టీచర్ పాఠశాలలను 33 శాతానికి పెంచాం
- రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కషి
- శాసనసభలో విద్య, ఐటీ మంత్రి లోకేష్ సమాధానం
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం వచ్చాక జీవో 117 రద్దుచేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… “గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ -వన్ టీచర్ విధానం కీలకమైంది. గతంలో 3శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ -వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33శాతానికి పెంచాం. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అంది.. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. ప్రధానంగా లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింట్స్, బెంచీలు, టాయ్లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇచ్చాం. ఏపీలో 5స్టార్ రేటింగ్ ఉన్నవి లేవు. 40శాతం 1, 2లో స్టార్లలో ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3, 4 స్టార్ రేటింగ్కు తేవాలన్నది ప్రజాప్రభుత్వ లక్ష్యం. పెండింగ్ వర్క్స్ పూర్తిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరముందో, అక్కడ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని నిర్ణయించాం. ఎసఎంసీ అకౌంట్లో రూ.200 కోట్ల నిధులున్నాయి. బడ్జెట్లో రూ.800 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ రెండు కలిపి వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేసే అవకాశముంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పద్ధతి ప్రకారం ఫైవ్స్టార్ రేటింగ్ తెచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. 2014-19 నడుమ చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ… గత ప్రభుత్వం పాఠశాలల విషయంలో అస్తవ్యస్థ విధానాలు అవలంభించింది. నాడు-నేడు పేరుతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడింది. వాటి కారణంగా నేటికీ అనేకచోట్ల అసంపూర్తి నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యాన నూతన విద్యావిధానానికి శ్రీకారం చుట్టి, పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టారు. మనబడి -మన భవిష్యత్ పేరిట పాఠశాలలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అసంపూర్తిగా నిలిచిన భవనాలు, తరగతి గదులను సత్వరం పూర్తిచేయాల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు తిత్లీ తుపానులో అనేక పాఠశాలలు దెబ్బతిన్నాయి. నాటి చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసినప్పటికీ, టీడీపీ సానుభూతిపరులు పనులు చేశారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం వాటి బిల్లులు చెల్లించలేదు. గత ఐదేళ్లలో నాడు-నేడు అక్రమాలపై చర్యలు తీసుకోండి. అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు పూర్తిచేయాల్సిందిగా గౌతు శిరీష విజ్ఞప్తి చేశారు.













