- 2026 జూన్కి ఫేజ్ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇస్తామని స్పష్టీకరణ
- దళారులను నమ్మి మోసపోవద్దని హితవు
- ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వాసితుల పునరావాసానికి సమ ప్రాధాన్యం ఇస్తామని ఉద్ఘాటన
ఏలూరు (చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం పండుగ వాతావరణంలో జరిగిన సభలో నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ చేశారు. నిర్వాసితులకు భూసేకరణ, పునరావాసం పరిహారం నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు నిర్వాసితులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ చారిత్రక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి త్యాగధనులైన నిర్వాసితులందరికీ పరిహారం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు కొండంత అండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతునిచ్చిన ప్రధానమంత్రి మోదీకి మనమంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని పిలుపునిచ్చారు. నాడు, నేడు కూడా చంద్రబాబు హయాంలోనే నిర్వాసితులకు న్యాయం జరిగిందని రామానాయుడు స్పష్టం చేశారు. అందులో భాగంగానే 2016లో రూ.700 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన సంగతిని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరిలో రూ. 900 కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు రెండోసారి రూ.1000 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమవుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో కూడా నిర్వాసితులందరినీ కూటమి ప్రభుత్వం నిండు మనసుతో ఆదరిస్తుందన్నారు. వారికి అండగా నిలబడుతుందన్నారు.
వైసీపీ పాలనలో విధ్వంసం
5ఏళ్ళ వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. నిర్వాసితులందరినీ గాలికి వదిలేశారు.. ఆశ్రయం కోల్పోయిన నిర్వాసితులు వరదల సమయంలో పడ్డ కష్టాలు అందరికీ తెలుసు అన్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే.. 2019- 24 మధ్య వైసీపీ అరాచక ప్రభుత్వం మూడు శాతం కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. పోలవరం నిర్మాణ ప్రగతిని పాతికేళ్ళు వెనక్కి నెట్టేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణాన్ని గాడిలో పెట్టడంతో పాటు, ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులందరికీ అండగా నిలబడ్డ విషయాన్ని గుర్తించాలన్నారు. అన్యాయం చేసిన వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. నాడు జగన్ పాలనలో నిర్వాసితులు తమను తెలంగాణాలో కలిపేయమని రోడ్డెక్కి అందోళన చేసిన పరిస్థితిని మంత్రి గుర్తు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పునరావాస కాలనీల నిర్మాణానికి ఒక్క బస్తా సిమెంట్ గానీ, నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహాం గానీ ఇవ్వలేదని మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన రూ.3385 కోట్ల రియింబర్స్మెంట్ నిధులను కూడా, ప్రాజెక్టు నిర్మాణానికి గానీ, నిర్వాసితులకు గానీ, అందించకుండా దారి మళ్లించారని మంత్రి రామానాయుడు విమర్శించారు.
ప్రాజెక్ట్ పూర్తికి ఆరు నెలలు ముందే..
కూటమి ప్రభుత్వ హయాంలో ఫేజ్ 1 కింద 41.15 మీటర్ల కాంటూరులో, 2026 జూన్ నాటికి సహాయ, పునరావాసం, ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పునరావాసం, కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ.739 కోట్లతో ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయని ప్రకటించారు. ప్రస్తుతం 75 నిర్వాసిత కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సమాంతరంగా మౌలిక సదుపాయాలు కల్పనకు కూడా కృషి చేస్తున్నామన్నారు. తొలిదశ ఆర్అండ్ఆర్ 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూసేకరణ, పరిహారం విషయం లో దళారుల పాత్ర ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఆరు నెలలు ముందే ఫేజ్ -2 నిర్వాసితుల పరిహారం, తదితర సమస్యలు పరిష్కరిస్తామని రామానాయుడు స్పష్టం చేశారు.














