- ఏపీకి సమీకృత లాజిస్టిక్స్ ప్రణాళిక
- ఏపీఎం టెర్మినల్స్తో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం
- సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయూ
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వేగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవరూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణలో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ మోలర్ మేర్క్స్ అనుబంధ సంస్థ ఏపిఎం టెర్మినల్స్ రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధికి ఏపీ మారిటైమ్ బోర్డుతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.9 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధితోపాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు- ఏపీఎం టెర్మినల్స్ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ పోర్టుల్లో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నిర్వహణను చేపట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి ఉద్యోగాలు దక్కే అవకాశముంది. మరోవైపు దేశీయంగా ఉన్న మార్కెట్లో సరకు రవాణాకూ ఏపీఎం టెర్మినల్స్ సంస్థ సేవలు ఉపకరించాలని సీఎం స్పష్టం చేశారు. పోర్టులకు అనుబంధంగా ఆర్ధిక ఎకో సిస్టంను రూపొందించాలని సీఎం సూచించారు. పోర్టులు, లాజిస్టిక్స్తో ఏపీని ఫ్యూచర్ ఎకానమీగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
లాజిస్టిక్స్ హబ్ అఫ్ ఇండియాగా ఏపీ
ఏపీని దేశంలో లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైలు, రోడ్డు, అంతర్గత జలమార్గాలు, వాయుమార్గాల ద్వారా రవాణాకయ్యే కార్గోకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో సహకారం అందించాలని ఏపీఎం టెర్మినల్స్ సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. తెలంగాణ, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు ఏపీలోని పోర్టులపైనే ఆధారపడుతున్నాయని.. ఈ రాష్ట్రాలనుంచి వచ్చే సరకు అతి తక్కువ వ్యయంతో రవాణా అయ్యేలా ప్రణాళిక ఉండాలని సీఎం సూచించారు. ఏపీలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సహా ఇతర ఉన్నతాధికారులు, ఏపీఎం టెర్మినల్స్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.