పల్లా కుటుంబ సభ్యులకు పరామర్శ
విశాఖపట్నం (చైతన్యరథం): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. గత శనివారం పల్లా సింహాచలం స్వర్గస్థులయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ నగరం సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్.. అక్కడ పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి లోకేష్ గుర్తుచేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పల్లా సింహాచలం మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.