- రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
- పట్టుదల, కమిట్మెంట్తో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఇంటికి క్షేమంగా వెళ్లేవరకు అధికారులదే బాధ్యత
- అధికారులతో సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైంది, ఆరోజున మనం సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఒకే ప్రాంతంలో 5లక్షలమందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది, ప్రధాని మోడీజీ హాజరు కాబోతున్నారు, అధికారులంతా పట్టుదల, క్రమశిక్షణ, కమిట్మెంట్తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
ఇది రాష్ట్రప్రజలందరి కార్యక్రమం, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయపక్షాలు భాగస్వాములు కావాలి. యోగావల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుందని ప్రధాని చెబుతున్నారు. దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. ఈనెల 21న విశాఖ ఆర్కె బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్మెంట్లలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు ప్రధాని ఆర్కె బీచ్ ఖాళీమాత ఆలయం వద్ద ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారు. అంతకు గంటముందే ప్రజలంతా ఆయా కంపార్ట్మెంట్లకు చేరేలా రవాణా సౌకర్యం కల్పించండి. సుదూర ప్రాంతాల్లో నిలిపివేసి ఇబ్బందులకు గురిచేయొద్దు. 600 మీటర్లకు మించి ప్రజలను నడిపించకుండా వాహనాలను వదలాలి. ప్రజలు ఇళ్లవద్ద నుంచి ప్రాంగణానికి చేరేదగ్గర నుంచి తిరిగి వారు ఇంటికి చేరేవరకు అధికారులు బాధ్యత తీసుకోవాలి. 19,20,21 తేదీలు కీలకం, అధికారులంతా ప్రణాళికాబద్ధంగా, కలసికట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. సమావేశానికి ముందు ఎయు గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న యోగా శిక్షణను మంత్రి లోకేష్ తిలకించారు.
ప్రతి కంపార్ట్మెంట్ కు ఒక గెజిటెడ్ అధికారి!
విశాఖలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్గా నియమితులైన ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ… యోగా డే నిర్వహించే 247 కంపార్ట్మెంట్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కంపార్ట్మెంట్కు ఒక గెజిటెడ్ అధికారికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలంతా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా వారిని నిర్ణీత కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని రాత్రి 2గంటలనుంచే అనుమతించేలా చర్యలు చేపట్టాం. జనాన్ని తీసుకొచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్రమబద్ధీకరించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, 1200 కెమెరాలను అమర్చాం. ఆర్కె బీచ్ నుంచి భీమిలివరకు 30 ప్రధాన లోకేషన్లతోపాటు మరో 18 అదనపు లోకేషన్లలో కూడా ఏర్పాట్లు చేశాం.
కార్యక్రమ నిర్వహణ కోసం 2వేలమంది యోగా ఇన్స్ట్రక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. వారందరినీ ముందురోజు రాత్రే ఎయు గ్రౌండ్స్కి రప్పిస్తాం. ముందుజాగ్రత్త చర్యగా 116 అంబులెన్స్లను సిద్ధం చేశాం. హాజరయ్యే వారందరికీ మ్యాట్లు, టీ షర్ట్లు ఆయా కంపార్ట్మెంట్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశాం. 1400 బయో టాయ్లెట్లను అందుబాటులో ఉంచుతాం. విశాఖతోపాటు పరిసర జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం 3,500 ఆర్టీసీ బస్సులు, 8 వేల ప్రైవేటు, స్కూలు బస్సులను సిద్ధంచేశాం. ప్రజలను సురక్షితంగా రప్పించి తిరిగే తీసుకెళ్లేలా సెక్రటేరియట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించామని కృష్ణబాబు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయుస్వామి, రాష్ట్రమంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసద్, గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ హరీంద్రప్రసాద్, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.