అమరావతి (చైతన్యరథం): ఏపీ మెగా డీఎస్సీ తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించగా.. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగిసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6నుంచి 30వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల్లో భాగంగా తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 91 కేంద్రాల్లో ఉదయం సెషన్లో 16,102 మందికి గాను 14, 281 మంది (88.69శాతం) హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం సెష న్కు 51 కేంద్రాల్లో 8,790మందికి గాను 7,611 మంది (86.7శాతం) హాజరయ్యారని తెలిపారు.
జిల్లాల వారీగా హాజరు శాతం పరిశీలిస్తే ఉదయం సెషన్కు కడప జిల్లాలో అత్యధికంగా 91.1శాతం నమోదు కాగా.. మధ్యాహ్నం సెషన్కు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 92 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర పరిశీలకులు నేరుగా పర్యవేక్షించారన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమర్థత కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్రస్థాయి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు సమర్పించిన విషయం తెలిసిందే.