- మొదటి 2 వారాల్లోనే శిక్షణలో నెలవారీ లక్ష్యాన్ని దాటిన ప్రగతి
- ఇప్పటికే పూర్తయిన 93 శాతం పౌరుల నమోదు
- వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడి
అమరావతి (చైతన్యరథం): ప్రజల్లో యోగాపై అవగాహన పెంచి, మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర వివిధ అంశాలకు సంబంధించి లక్ష్యాలను అధిగమిస్తూ దూసుకుపోతోంది. మే 21న ప్రారంభించిన ఈ నమోదు కార్యక్రమం ద్వారా యోగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి పౌరుల నమోదు 2 కోట్ల లక్ష్యంగా పెట్టుకోగా, గురువారం నాటికి 1,86,46,143 మంది యోగా ఔత్సాహికులు ఇప్పటికే నమోదు చేసుకున్నారని యోగాంధ్ర పురోగతిని పర్యవేక్షిస్తున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యోగాంధ్ర రాష్ట్ర సమన్వయకర్త ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇది 93 శాతం అని ఆయన వివరించారు. యోగాంధ్ర కార్యక్రమ కార్యకలాపాలకు ఇంకా 2 వారాలు మిగిలి ఉన్నందున తుది నమోదు 2 కోట్ల లక్ష్యాన్ని మించిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
నెలవారీ లక్ష్యాన్ని దాటాం
శిక్షకుల నమోదు మరియు శిక్షకులకు శిక్షణకు సంబంధించి నిర్దేశించుకున్న నెలవారీ లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని ఆయన చెప్పారు. 2,600 మంది మాస్టర్ ట్రైనర్ల నమోదు లక్ష్యానికి గాను 5,451 మంది (209%) ఇప్పటికే నమోదు చేసుకున్నారన్నారు. మండల స్థాయిలో 1,25,000 మంది లక్ష్యానికి గాను 118 శాతం మంది అంటే 1,47,817 మంది శిక్షకులు నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. శిక్షకులకు శిక్షణకు సంబంధించి 5,451 మంది మాస్టర్ ట్రైనర్లు (లక్ష్యంలో 206%), 1,43,881 (115%) మంది మండల్ ట్రైనర్లకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామన్నారు.
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,34,991 ప్రదేశాల్ని నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటివరకు 78,730 ప్రదేశాల్ని నమోదు చేశారని కృష్ణబాబు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుందని తెలిపారు.
యోగాంధ్ర నెలలో 26 జిల్లాల్లో జరిగే సన్నాహక యోగా కార్యక్రమాల్లో మొదటి రెండు వారాల్లో 11 చోట్ల యోగా ప్రదర్శనలు జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 100 పర్యాటక ప్రదేశాలలో 42 చోట్ల కార్యక్రమాలు జరిగాయని, గ్రామ, మండల స్థాయిలో ఇప్పటివరకు మొత్తం 15,783 యోగా సంబంధిత పోటీలు నిర్వహించామని ఆయన వివరించారు.
ఈ నెల 21న విశాఖపట్నం-భీమిలి తీరం వెంబడి ఒకే చోట 5 లక్షల మంది పాల్గొనే యోగా కార్యక్రమాలను రికార్డు స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారని ఆయన తెలిపారు