- సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు సరైన సమాధానం
- ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు వందనం
- భారత ప్రతిష్టను చూడలేక అసూయతో పాక్ కుట్రలు
- భారత్వైపు ముష్కరులు కన్నెత్తి చూడకుండా సైన్యం జవాబిచ్చింది
- మనదేశ బలం, బలగం సాయుధ దళాలే
- ఉగ్రవాదంపై ప్రధాని మోదీది రాజీలేని పోరాటం
- తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం
- వందేమాతరం నినాదాలతో మార్మోగిన బెజవాడ
విజయవాడ (చైతన్య రథం): మహిళల నుదుటి సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్తో బలమైన బదులిచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గహించాలని, మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. ఉగ్రవాదంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న సైనికులకు శాల్యూట్ చేస్తున్నానన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాడని, ఉగ్రవాదం అంతుచూడాలని ప్రధాని సంకల్పించారన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… పహల్గాం ఘటన గుర్తుకురాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమిమీద ఉండకూడదని ఆపరేషన్ సిందూర్కు శ్రీకారం చుట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నా. వారి పోరాటంవల్లే మనం క్షేమంగా ఉన్నాం. మన దేశ గౌరవం, బలం, బలగం సాయుధ బలగాలే. ఉగ్రవాదులు భారత్వైపు కన్నెత్తి చూడకుండా రక్షణ దళాలు ఉగ్రవాద శిబిరాలను కుప్పకూల్చాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు… దేశమంతా గర్విస్తోంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం అన్నారు.
ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం
మన దేశానికి సరైన సమయంలో దొరికిన సమర్థ నాయకుడు ప్రధాని మోదీ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. మనం ఎప్పుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పితీరుతాం. ప్రధాని మోదీ ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడా దాక్కున్నా తుదముట్టించేందుకు ప్రధాని సంకల్పించారు. ఆపరేషన్ సిందూర్తో శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తీవ్రవాద రూపంలో మనదేశానికి వస్తే అదేవారికి చివరిరోజవుతుంది. మన దేశం రక్షణలోనే కాదు ఆర్థిక శక్తిగానూ ఎదుగుతోంది. కుట్రలు, కుతంత్రాలు, అసూయ పడేవారెవరూ మన దేశాన్ని ఏం చేయలేరు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం మొదటి లేదా రెండో స్థానాల్లో నిలుస్తుంది. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ స్ఫూర్తితో ముందుకు వెళదాం’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.