- అందుకు ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తోంది
- మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు జైత్రయాత్ర సాగుతుంది
- స్థానిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనున్న ఎల్జి యూనిట్
- రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పెద్ద ఎఫ్డిఐ శ్రీసిటీ ఎల్జి యూనిట్
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ
- ఎల్జి శ్రీసిటీ యూనిట్కు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భూమిపూజ
తిరుపతి (చైతన్యరథం): రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్కు లోకేష్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. తాము ఈరోజు ఎల్జి యూనిట్ కు మాత్రమే కాదు – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దది. ఇది మన రాష్ట్రంతోపాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. ఆవిష్కరణ, పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను తీసుకురావడమే గాక పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీపై ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జి శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైంది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబునాయుడి నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. మేము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడంమేగాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నాం. శ్రీసిటీలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక తయారీ కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, ఎల్జి, దాని విక్రేత కంపెనీల నాయకత్వ బృందాలు, భాగస్వాములందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని మంత్రి లోకేష్ అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నాం
ఎల్జి ఫ్యాక్టరీ అధునాతన గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు.. స్మార్ట్, ఇంధన -సమర్థవంతమైన సాంకేతికతతో ఉత్పత్తులను అందిస్తుంది. ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ, ఒక స్మార్ట్ రాష్ట్రం, ఒక స్మార్ట్ దేశం యొక్క సరికొత్త ప్రయాణం ఈరోజు ప్రారంభమవుతుంది. ఇది కేవలం తయారీ గురించి కాదు. ఇది జీవన భవిష్యత్తును రూపొందించడం గురించి. ఇది ఉద్యోగాలను సృష్టించడం, మన యువతకు సాధికారత కల్పించడం, జీవితాలను మార్చడం గురించి. మేము కేవలం కర్మాగారాలను నిర్మించడం లేదు. మేము రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నాం. ఎల్జి ప్రధాన యూనిట్ దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఎల్జి ముఖ్య విక్రేతలు అదనంగా రూ.839 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా మరో 690కి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కంపెనీకి ఒక కొత్త ఆవిష్కరణ కంటే ఆంధ్రప్రదేశ్ యువతకు కలల సాకార క్షణం. ఎల్జి సప్లయ్ చైన్ను మరింత బలోపేతం చేయడమేగాక దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే హైటెక్ యూనిట్ ఇది. ఎల్జి నాలుగు కీలక విక్రేత భాగస్వాములైన ఎకోరియా, కురోడా ఎలక్ట్రిక్, హేంగ్ సంగ్ ఇండియా, క్యుంగ్సంగ్ ప్రెసిషన్ అండ్ టేసంగ్ ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్య శక్తి పురోగతికి పాస్పోర్ట్ లాంటివి. ఇది వారి ఉమ్మడి సహకార వృద్ధి శక్తిని చాటడమేగాక ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందో కూడా ప్రపంచానికి చూపిస్తుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
వాణిజ్యానికి ఏపీ గేట్లు తెరిచే ఉన్నాయ్
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు.. ఆంధ్ర ఆశయాన్ని నెరవేర్చినప్పుడు అద్భుతమే జరుగుతుంది. ఎల్జి సంస్థ, దాని భాగస్వాములు కలిసి భారతీయ గడ్డపై ఏఐ-ఆధారిత తయారీ, స్మార్ట్ ఉత్పత్తి ప్రక్రియలు, ఎనర్జీ ఎఫిషియంట్ విధానాలు, అత్యాధునిక సాంకేతికతలను తీసుకువస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచస్థాయి కేంద్రంగా ఏపీని మార్చాలనే మా ఆశయాన్ని ఎల్జి సంస్థ ముందుకు తీసుకెళ్తోంది. శ్రీ సిటీ పారిశ్రామిక పురోగతికి ఒక చుక్కానిలా మారింది. ఇలాంటి ప్రాజెక్టులతో మేము ఏపీ భవిష్యత్తును నిర్మిస్తున్నాం, స్మార్ట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాం. భూసేకరణ, నిర్మాణం నుండి పూర్తి స్థాయి ఉత్పత్తి వరకు – ఈ ప్రాజెక్టు ప్రతి దశలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మా నిరంతర మద్దతు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి, అధునాతన ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి మేం కట్టుబడి ఉన్నాం. వాణిజ్యానికి ఏపీ ద్వారాలు తెరిచే ఉంటాయి. సరికొత్త ఆవిష్కరణల కోసం, మార్పుకోసం ఏపీ ఆతృతగా ఎదురుచూస్తోంది. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని మనం కొనసాగిద్దాం. ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు 94 శాతం స్ట్రయిక్ రేట్తో మ్యాండేట్ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనకు యువత మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
ఎయిర్ పోర్టుకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తాం
ఎల్జి యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం, ఇక్కడ అనుబంధ యూనిట్లతోపాటు ఎల్జీ సిటీ నిర్మించండి. రాబోయే నాలుగేళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తాం. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న ఎల్జి ఎలక్ట్రానిక్స్కు ధన్యవాదాలు. ఎల్జి ఫ్యాక్టరీ.. యువ ఇంజనీర్లు, ఆశావహ సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులకు కలల కర్మాగారంగా మారబోతోంది. మనం కలసికట్టుగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవడం, ఉత్పత్తులను సాధించడమేగాక అవకాశాలను నిర్మించుకుందామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: కొరియా రాయబారి
భారత్లో కొరియా రాయబారి లీ సియాంగ్ హూ మాట్లాడుతూ… గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తమ దేశానికి చెందిన కియా కంపెనీ ఏర్పాటైందని, ఇప్పుడు ఎల్జి వస్తోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, భారత్లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, ఎల్జి ఎలక్ట్రానిక్స్ హోం సొల్యూషన్స్ సీఈఓ జేచియోల్ లియు, ఎకో సొల్యూషన్స్ సిఈఓ జే సంగ్ లీ, ఏపీ సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీఐఐసి వైస్ చైర్మన్ అభిషిక్త్ కిషోర్, కాన్సులేట్ జనరల్ (ఏపీ, తెలంగాణా) చుక్కపల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.