- కౌంటర్ దాఖలుకు కేంద్రానికి వారం గడువు
- తదుపరి విచారణ మే 5కు వాయిదా
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) చట్టం- 2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీ నోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అయితే, అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5కు వాయిదా వేసింది.
వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ చట్టంలో కొన్ని సెక్షన్లను మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని ధర్మాసనాన్ని కోరారు. ఈ విషయంలో అనేక సవరణలు, కమిటీల ఏర్పాట్లు, లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్రామాలకు గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగానూ, వ్యక్తిగత ఆస్తులనూ తీసుకున్నారని వివరించారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్జప్తి చేశారు.
చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని .. తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్లో ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ.. ఏ రాష్ట్రం అయినా.. నియామకాలు చేస్తే.. అవి చట్టబద్దమైనవిగా పరిగణించకూడదన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వారం రోజులు సమయం ఇచ్చింది. ఇక తదుపరి విచారణ తేదీ వరకు.. యూజర్ బై వక్ఫ్గా పేర్కొన్నవాటితోపాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ అయిన ఆస్తులు.. డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీ కోర్టు ఆదేశించింది. అంత వరకు వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించింది. ఇవే పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా వక్ఫ్ న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్స్ బోర్డులు, కేంద్ర వక్స్ మండలిలో.. ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ సూచించింది. మతంతో సంబందం లేకుండా ఎక్స్-అపీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది.