- పూర్తి అధ్యయనం తరువాతే చట్ట సభ ముందుకు బిల్లు
- అసెంబ్లీలో ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లు -2025తో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులతో పాటు ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లు -2025ను ప్రవేశపెట్టిన తరువాత మాట్లాడుతూ…. ఏపీలో జరుగుతున్న పట్టణీకరణతోపాటు వేగంగా నిర్మాణమవుతున్న బహుళ అంతస్తుల భవనాలు, ఆస్పత్రులు, వ్యాపార సముదాయాలు, హాటళ్లు, షాపింగ్ మాల్స్ను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు మరియు ఎస్కలేటర్లు బిల్లు -2025ను రూపొందించినట్టు వివరించారు. లిఫ్టులు, ఎస్కలేటర్ల వినియోగంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని మంత్రి గొట్టిపాటి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు ప్రజల భద్రత ముఖ్యమన్నారు. కొత్త బిల్లు చట్టరూపం దాల్చితే లిఫ్టులు, ఎస్కలేటర్ల ప్రమాదాలను చాలావరకు కట్టడి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లును 2024లోనే తీసుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పూర్తిస్థాయి అధ్యయనం తరువాతే….
లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల చట్టాన్ని దేశంలోని 15 రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్వంటి రాష్ట్రాల్లో అమల్లోవున్న చట్టాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లు -2025ను రూపొందించి చట్టసభల్లో ప్రవేశ పెట్టామని వివరించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలతోపాటు అతి ముఖ్యమైన పౌరుల భద్రత దృష్ట్యా బిల్లును చట్ట రూపంలోకి తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అదే విధంగా సీసీ కెమెరాల వినియోగం, డేటాను భద్ర పరచడం వంటి వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ బిల్లులో పొందుపరిచామన్నారు. బిల్లుకు సంబంధించి గౌరవ సభ్యులు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.