- ఆగస్టులో విశాఖపట్నంలో విద్యామంత్రుల కాంక్లేవ్ నిర్వహణ
- యూనివర్సిటీ అడ్మినిస్టేషన్కు ఏకీకృత చట్టం తెస్తాం
- కాలేజీనుంచి బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికీ ఉద్యోగం సిద్ధం
- గత ప్రభుత్వ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ప్రమాణాలు
- ప్రజాప్రతినిధుల చొరవతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే ఐదేళ్లలో ప్రపంచమంతా మనవైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేష్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలో సుదీర్ఘంగా ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టమైన విద్యాశాఖను కోరుకున్నా. కేజీ టు పీజీ ప్రక్షాళన చేయాలని భావించా. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 9నుంచి 3కు, క్విఎస్ టాప్ -100 ర్యాంకింగ్స్లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారు. విద్యామంత్రి అయ్యాక ఈ శాఖలో దారుణమైన పరిస్థితులను చూశాను. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 12లక్షలమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. గత ప్రభుత్వం సర్కారీ విద్యకు సంబంధించి అనేక మాటలు చెప్పింది. చేతల్లో అంతా డొల్లతనమే. జీవో 117పై ఇటీవల వర్క్షాపు పెట్టాం. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనవల్ల 10మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లు 5507కు, 20మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 13,720కి పెరిగాయి, సింగిల్ టీచర్ స్కూల్స్ 30శాతం అంటే 12,512కు పెరిగాయి. రాష్ట్రంలో డ్రాపవుట్ రేటు ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో 12.5శాతానికి వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా 7నుంచి 8వతరగతికి 47వేలమంది ఆడపిల్లలు విద్యకు దూరమయ్యారు. తాను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అధికారులను అడిగితే వారాలు, నెలల తర్వత 33.40లక్షల మంది ఉన్నారని చెప్పారు. డ్రాప్ బాక్సు విధానం వల్ల సరైన వారు సరైన సంఖ్య చెప్పలేదు. 17 ఏళ్లకన్నా ఎక్కువ వయసు కలిగిన దాదాపు లక్షమంది పిల్లలు డ్రాప్బాక్సులో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా గ్రాస్ రోల్మెంట్ రేషియో ఎక్కువగా చూపేందుకు ఇలా చేశారని లోకేష్ వివరించారు.
నాస్ సర్వేలో బట్టబయలైన వైసీపీ ప్రభుత్వ నిర్వాకం
నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) సర్వే రిపోర్టు ప్రకారం 2017లో థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్లో ఏపీ విద్యార్థులు దేశంలో నెం.1 స్థానంలో ఉండగా, 2021కి వచ్చేసరికి 27వ స్థానానికి పడిపోయాం. టెన్త్ మ్యాథ్స్లో గతంలో ఒకటోస్థానంలో ఉండగా, గత ప్రభుత్వంలో 12వ స్థానానికి పడిపోయింది. సైన్స్లో ఒకటోస్థానం నుంచి 15వ స్థానానికి, ఇంగ్లీషులో 4నుంచి 14వ స్థానానికి పడిపోయాం. ఫౌండేషన్ స్కిల్స్పై అసర్ నివేదిక కూడా గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసర్ రిపోర్టు ప్రకారం 2018లో తెలుగుభాషకు సంబంధించి, గ్రేడ్ -5 పిల్లలు గ్రేడ్ -2 చదవవడంపై పరీక్షించినపుడు 57నుంచి 38శాతానికి పడిపోయింది. గ్రేడ్ -8 విద్యార్థులకు 2వతరగతి తెలుగు టెక్స్ట్బుక్ ఇచ్చి చదివించగా, 2018లో 78 శాతం మంది చదివితే… 2024లో 53శాతానికి పడిపోయింది. 90శాతం మంది 3వతరగతి పిల్లలకు ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ లేవని మంత్రి లోకేష్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
ముందస్తు వ్యూహం లేకుండా సీబీఎస్ఈ పేరుతో హడావిడి
మాజీముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సీబీఎస్ఈ విషయంలో అనాలోచిత ప్రకటన చేశారని లోకేష్ దుయ్యబట్టారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెయ్యిపాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్ విధానాన్ని బలవంతంగా రుద్దారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి మాక్ టెక్స్ట్ నిర్వహిస్తే 90శాతం మంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. అది చూశాక ఉపాధ్యాయులను ప్రిపేర్ చేసి, తర్వాత అమలుచేద్దామని నిర్ణయించి, సీబీఎస్ఈ విధానాన్ని మూడేళ్లకు వాయిదా వేశాను. 2వది టోఫెల్ పేరిట రూ.59కోట్లు వృధా చేశారు. 3వది ఐబి కరిక్యులమ్. అది చాలా కష్టతరమైన విధానం. అద్భుతమైన ఉపాధ్యాయులు, ట్రైనింగ్ ఉంటేనే పెద్దపెద్ద పాఠశాలల్లో దానిని అమలుచేస్తారు. ఐబీ ప్రాథమిక నివేదిక కోసమే రూ.5 కోట్లు ఖర్చుచేశారు. గత ఐదేళ్లలో టీచర్లు ప్రాక్టికల్ సమస్యలు తెలియజెప్పేందుకు వెళితే విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీ, మినిస్టర్ దొరికేవారు కాదు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మద్యం షాపులముందు సెక్యూరిటీగా నిలబెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కుంటిసాకులతో 2022లో 1530మందిని ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా ట్రాన్స్ఫర్ చేశారు. 45 అనవసరమైన యాప్లు పెట్టి, టీచర్లు విద్యాబోధనపై శ్రద్ధపెట్టలేని పరిస్థితికి తెచ్చారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులతో టాయ్లెట్ ఫోటోలు తీయించిన అసమర్థ విధానం గత ప్రభుత్వంలో నడిచిదంటూ మంత్రి లోకేష్ వివరించారు.
స్కూళ్లలో మౌలిక వసతులను గాలికొదిలేశారు
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం 2018లో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నపుడు హామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ద్వారా స్కూల్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టు కింద నిధులు తెస్తే గత ప్రభుత్వం గాలికొదిలేసింది. నాడు-నేడు విషయంలో గొప్పలు చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే నాడు-నేడు ఫేజ్- 1లో రూ.880 కోట్ల పనులు, ఫేజ్ -2 లో రూ.4వేల కోట్ల పనులు ఇప్పటికీ పెండిరగ్లో ఉన్నాయి. మరో విచిత్రమైన విషయమేమిటంటే ప్రభుత్వ స్కూళ్లలో రంగులు వేసి హడావిడి చేసిన చోట జీవో 117 కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. సైంటిఫిక్ విధానం లేకుండా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. 2019-24 నడుమ కేంద్రప్రభుత్వం సమగ్ర శిక్షకింద రూ.900 కోట్లు సివిల్ వర్క్స్కు కేటాయిస్తే రాష్ట్రం వాటా ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఆ నిధులు మురిగిపోయాయని మంత్రి వివరించారు.
గుడ్లు, చిక్కీలను వదలకుండా బొమ్మలు వేసుకున్నారు
విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని నిర్ణయించాం. ఏ పార్టీ రంగులు ఉండకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో స్టూడెంట్ కిట్స్ను సైతం రాజకీయ నాయకుల ఫోటోలతో నింపేశారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ బాటనీ టెక్స్ట్బుక్పై ముఖ్యమంత్రి, లక్ష్మీపార్వతి, ప్రిన్సిపల్ సెక్రటరీ, పుస్తకరచయితల సందేశాలతో 9పేజీలు ముందుమాట ప్రచురించారు. వీటిని తొలగించడంతో ఈ ఏడాది రూ. 30లక్షల ఆదా అయ్యాయి. స్కూలు పిల్లలకు ఇచ్చే చిక్కీ, బెల్ట్లపై కూడా ఆయన ఫోటోలు వేసుకున్నారు. పిల్లలు రాసే వర్క్బుక్పై కూడా మాజీ సీఎం ఫోటో వేశారు. చివరకు డిక్షనరీని కూడా వదల్లేదు. పిల్లలకు పౌష్టికాహారంగా ఇచ్చే గుడ్డును కూడా వదలకుండా స్టాంప్ వేసుకున్నారు. బ్యాగ్పై కూడా ఆయన పేరుంది. ఎంత అన్యాయం? గత ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రాపగాండ మిషన్గా వాడుకుంది. గతంలో స్కూల్ యూనిఫాం వన్ సైడ్ ప్రింటింగ్ వల్ల నాసిరకంగా ఉండేవి. స్కూల్ కిట్స్కు రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదని నిర్ణయించాం. అందుకే ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో కిట్స్ ఇస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు.
రాబోయే ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల ఆదా చేస్తున్నాం
రాబోయే అయిదేళ్లలో స్టూడెంట్ కిట్లలో 305 కోట్లు ఆదా చేస్తున్నాం. మన ప్రభుత్వానికి ఫోటోల పిచ్చి లేదు. అందుకే చిక్కీపై ఏపీ ప్రభుత్వ లోగోవేశాం. టు సైడ్ ప్రింటింగ్ క్లాత్ ఇస్తున్నాం. సొంతబిడ్డల్లా శ్రద్ధవహించి డిజైన్ చేశాం. ఫీల్డ్లో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. వర్క్బుక్స్లో కూడా మా ఫోటోలు లేవు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలు చదవాలని ఈ నిర్ణయాలు తీసుకున్నాం. బ్యాగులపై కూడా రాజకీయరంగులు లేవు. బ్యాగ్ స్టిచ్చింగ్ కూడా నాణ్యంగా ఉండేలా చేస్తున్నాం. రాబోయే ఐదేళ్లలో చిక్కీ సరఫరాలో రూ.240కోట్లు, గుడ్ల రవాణాలో రూ.144 కోట్లు మొత్తంగా పాఠశాల విద్యలో వెయ్యికోట్లు ఆదా చేయబోతున్నాం. గత ప్రభుత్వంలో ఏదేదో చేశామని గొప్పగొప్ప మాటలు చెప్పారు. గుడ్ల సరఫరాకు సంబంధించి రూ.200కోట్లు, చిక్కీ సరఫరాదారులకు రూ.60కోట్లు, ఆయాలు, నైట్ వాచ్మెన్ జీతాలకు రూ.62కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ రూ.22కోట్లు కలిపి మొత్తం 352 కోట్లు గత ప్రభుత్వం బకాయిపెట్టి వెళితే, కూటమి ప్రభుత్వం వచ్చాక తీర్చింది. గత ప్రభుత్వం ఐ ప్యాడ్స్ ఇస్తే పర్యవేక్షణ లేమి కారణంగా పిల్లలు అన్సీన్ కంటెంట్స్ చూస్తున్నారని తల్లిదండ్రులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని లోకేష్ వివరించారు.
15ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు సంబంధించి 2019-23 నడుమ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 8.17శాతం పిల్లలు తగ్గిపోగా, కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాదిలోనే 16.6శాతం విద్యార్థులు పెరిగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఫస్టియర్ పాస్ పర్సంటేజీ 42శాతం ఉండగా, గత ప్రభుత్వ చేతగానితనంవల్ల 30శాతానికి పడిపోయింది. సెకండియర్ గతంలో 58శాతం ఉంటే, వైసిపి ప్రభుత్వంలో 39శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది చాలా కష్టపడ్డాం, మంచి ఫలితాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు టెక్స్ట్బుక్, మిడ్ డే మీల్ కట్ చేశారు. అవగాహన లేకుండా హైస్కూలు ప్లస్ కార్యక్రమం పెట్టారు. అవసరమైన ల్యాబ్స్, సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా 11, 12 తరగతుల పాఠాలు చెప్పాలన్నారు. దీంతో అకడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని మంత్రి లోకేష్ సభ దృష్టికి తెచ్చారు.
సొంత కార్యకర్తలను వీసీలుగా నియమించారు
హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 2014-19 నడుమ 9 ఎన్ఐఆర్ఎఫ్ వర్సిటీలు ఉండగా, గత ప్రభుత్వంలో 5కి పడిపోయాయి. ఎఎన్యు, జెఎన్యు అనంతపురం, పద్మావతివంటి యూనివర్సిటీలకు ఎటువంటి ర్యాంకులు లేవు. సొంత కార్యకర్తలను వైస్ చాన్సలర్లుగా నియమించారు. వైసీపీ కార్యకర్తగా పనిచేసిన ప్రసాదరెడ్డిని ఎయు వీసీగా నియమించారు. ఆయన యూనివర్సిటీలో సీఎం పుట్టినరోజు నిర్వహించారు. అక్కడ రాజశేఖర్రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టారు. ఎస్వియులో పెద్దిరెడ్డి బంధువు రాజారెడ్డిని వీసీగా నియమించారు. శ్రీకాంత్రెడ్డికి పదేళ్ల నిబంధనలను ఉల్లంఘించి వీసీగా నియమించారు. ఆయన సజ్జలకు బంధువు. పొలిటికల్ మీటింగ్కు ఫ్లెక్సీలు పెట్టారు. రాజారెడ్డి బంధువు సుందరవల్లిని పద్మావతి వర్సిటీ వీసీగా నియమించారు. ఆర్జెయుకెటి చాన్స్లర్గా గవర్నర్ను తొలగించి సీఎంను చాన్స్లర్గా పెట్టారు. మొత్తం బంధువులతో వర్సిటీలను నింపేసి భ్రష్టుపట్టించారని మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టివెళ్లారు
కూటమి ప్రభుత్వం వచ్చేసరికి విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.4,271 బకాయిలు పెట్టి వెళ్లారు. జీవో 77 పేరుతో పీజీ ఫీ రీయింబర్స్ తీసేశారు. దీంతో గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో తగ్గడమేగాక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు పడిపోయాయి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు సంబంధించి జీవో 42 తేవడంవల్ల 137 విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ఎయిడెడ్ విద్యావ్యవస్థలో 1097 అధ్యాపకులు రోడ్డునపడ్డారు. ప్రైవేటు వర్సిటీలకు సంబంధించి ఎమెండ్మెంట్ తెచ్చి జాయింట్ కొలబరేషన్ డిగ్రీ టాప్ -100 ఉండాలని నిబంధన పెట్టారు. ఈరోజు విట్, ఎస్ఆర్ఎంవంటి ప్రఖ్యాత సంస్థలు ఉత్తమ విద్యాబోధన చేస్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలవల్ల పేటెంట్ ఫైలింగ్స్ ఏపీలో కేవలం 1400 ఉంటే, తమిళనాడులో 7,600 ఉన్నాయి. పిహెచ్డిలకు వచ్చేసరికి ఏపీలో 5600మంది విద్యార్థులుంటే, తమిళనాడులో 26వేలమంది ఉన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంవల్ల ఉన్నత విద్యలో ఎలా దిగజారామో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు.
పాలిటెక్నిక్, ఐటిఐలను బలోపేతం చేస్తాం
స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి రాష్ట్రంలో పెద్దఎత్తున పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలున్నాయి. వాటిని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పాలిటెక్నిక్లో అడ్మిషన్లు 69శాతానికి పడిపోయాయి. ఐటిఐ, పాలిటెక్నిక్లను ఎన్ సిక్విఎఫ్ అలైన్మెంట్ లేక విద్యార్థులు తగ్గారు. దాంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టివెళ్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి క్లస్టర్ మోడల్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. లీప్ మోడల్ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) గైడ్బుక్ తయారవుతోంది. ప్రభుత్వ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ విద్య, ఐటిఐ, పాలిటెక్నిక్ లు… విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫస్ట్ ఆప్షన్గా ఉండాలనే లక్ష్యంతో లీప్ మోడల్ తెస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో సీట్లకోసం రికమెండేషన్ లెటర్స్ కావాలని వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. వాల్యూబేస్ట్ గ్లోబల్లీ రిలవెంట్ ఎకోసిస్టమ్ ఏర్పాటుచేస్తామని మంత్రి అన్నారు.
పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు
ఒక్కో ఇటుక పేర్చుకుని వెళ్తూ పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాం. తొలుతగా క్లస్టర్స్ రీఆర్గనైజ్ చేశాం. జిఓ 117కి ఆల్డర్నేటివ్ సిద్ధం చేస్తున్నాం. ఉపాధ్యాయుల సలహాల కోసం ప్రతివారం పాఠశాల విద్య కమిషనర్ టీచర్ల సంఘాలను కలుస్తున్నారు. ప్రజాదర్బార్ లో అయిదున్నర గంటలు కూర్చుని ఉపాధ్యాయులతో చర్చించా. వారి సూచనలకు లోబడే 117కి ప్రత్యామ్నాయం తెస్తాం. కొత్త విధానంలో మోడల్ ప్రైమరీ స్కూలుకు కనీసం 60మంది విద్యార్థులు ఉండాలి. పాఠశాల విద్య బలోపేతానికి స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలకు ట్రైనింగ్ ఇస్తాం. కెజి టు పిజి కరిక్యులమ్ ప్రక్షాళన చేస్తున్నాం. ఎపి చరిత్రలో తొలిసారి హెచ్ ఆర్ డి విభాగానికి ఒకే సెక్రటరీని నియమించాం. ఉత్తమ విధానాలను పరిశీలించేందుకు అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపాం. మహారాష్ట్రలో పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించే విధానం బాగుంది. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ వారీగా పుస్తకాలు ప్రవేశపెట్టి, పిల్లలకు మోతబరువు తగ్గిస్తాం. మొదటి పేజిలో ఎవరి ఫోటోలు లేకుండా రాజ్యాంగ పీఠికను మాత్రమే ఉండేలా పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే ప్రకటించి, విద్యార్థులకు ఆహ్లాదం కలిగించే కార్యక్రమాలు చేపడతాం. వీటన్నింటికంటే ముఖ్యమైనది ఉపాధ్యాయులకు శిక్షణ. ప్రపంచంలో బెస్ట్ మోడల్ తీసుకుంటున్నాం. ఉత్తమ పద్ధతుల అధ్యయనానికి ఉపాధ్యాయులను ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు పంపాలని నిర్ణయించాం.
అమరావతిలో వరల్డ్ క్లాస్ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ సీనియారిటీ లిస్టు ఎవరి ప్రమేయం లేకుండా తయారు చేస్తున్నాం. లిస్టు ఫైనలైజ్ అయ్యాక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ చేయబోతున్నాం. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చట్టాన్ని తెస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించి సింగిల్ యాప్ తెస్తున్నాం. వచ్చే ఏడాదిలోగా అమరావతిలో వరల్డ్ క్లాస్ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుచేస్తాం. పాఠశాల విద్యలో లెర్నింగ్ అవుట్కమ్స్పై దృష్టిసారించాం. గ్యారంటీడ్ ఫౌండేషన్, లెర్నింగ్, న్యూమరీస్ అమలు చేయబోతున్నాం. పాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్లోకి తెస్తున్నాం. ప్రతి క్లాస్రూమ్ యాక్టివ్ లెర్నింగ్ తేవాలని భావిస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా ప్రశ్నలకు సమాధానమిచ్చే విధానం అమలుచేసి, వెనుకబడిన విద్యార్థులకు దానినిబట్టి హోమ్వర్క్ ఇచ్చేవిధానం తెస్తాం. విద్యార్థుల పనితీరుకు సంబంధించి పూర్తి వివరాలతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఇస్తున్నాం. జూన్, డిసెంబర్ నెలల్లో ప్రతిఏటా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తాం. విద్యార్థుల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. విద్యార్థులకు అపార్ ఐడిని కేంద్రం మ్యాండేట్ చేస్తుంది. కెజి నుంచి పిజి వరకు ఏం చదివారు, ఇతర వివరాలు అందులో ఉంటాయి. నైతిక విలువలపై ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో పుస్తకాలను తయారుచేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించాం. అందులో ప్రాథమిక విధులు కూడా పొందుపరుస్తాం. పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణకు సైకాలజీ కౌన్సిలర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. యాక్టివ్ ఏపీ పేరుతో స్కూల్ స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తాం. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటివాటిని ప్రోత్సహించి విద్యార్థుల మానసిక వికాసానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ సభకు వివరించారు.
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఓ తల్లి పాదయాత్ర సమయంలో తమ గోడు విన్పిస్తూ…గంజాయికి బానిస చేసి తన కూతుర్ని శారీరకంగా వాడుకున్నారని చెప్పింది. ఆరోజు ఎస్పీ గంజాయి లేదన్నారు, అదే సమయంలో ఒక స్కూలులో గంజాయి దొరికింది. డ్రగ్స్ వద్దు పేరుతో క్యాంపెయిన్ సీరియస్ గా. పాఠశాలల్లో కమిటీలు కూడా ఏర్పాటుచేస్తాం.హోంమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ డ్రగ్స్ ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్యలు చేపడుతోంది. పాఠశాలల్లో సైన్స్ ఫేర్, కల్చరల్ ఫేర్, యాన్యువల్ డే నిర్వహిస్తాం. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి గ్రీన్ పాస్ పోస్టు విధానం అమలుచేస్తాం. అసెంబ్లీ స్పీకర్, అధికారులు అనుమతిస్తే అమరావతిలోనే స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడకు పిల్లలను రప్పించి, ప్రజాసమస్యలపై జరిగే చర్చల్లో అవగాహన కల్పించాలని భావిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రిని కూడా రప్పించాలని అనుకుంటున్నాం. స్పెషల్ నీడ్స్ పిల్లలను ఆదుకునేందుకు కమిటీ వేస్తాం. ప్రతి మోడల్ ప్రైమరీ, హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుచేస్తామన్నారు.
మౌలిక వసతులకు పెద్దపీట వేస్తాం
జిఓ 117కి ఆల్టర్నేటివ్ వచ్చాక స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలనుబట్టి స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. దీనివల్ల ఏ పాఠశాలలు ఏ రేటింగ్లో ఉన్నాయి, ఏవి అభివృద్ధి చేయాలో తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలో ఒక స్కూలుకు వెళితే పిల్లలు నేలపై కూర్చున్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని ఆరోజే నిర్ణయించాను. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో గౌరవసభ్యులంతా భాగస్వాములు కావాలి. స్కూల్ మేనేజ్ కమిటీలు ఏర్పాటుచేశాం. పాఠశాలలకు అకడమిక్ ర్యాంకింగ్ కూడా ఇచ్చాం. దీనివల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారో అవగాహన వస్తుంది. రాబోయే 3నెలల్లో విద్యాశాఖ వివరాలతో డ్యాష్ బోర్డు ఏర్పాటుచేస్తాం. పెండిరగ్లో ఉన్న డిప్యూటీ డిఇఓ పోస్టులు భర్తీచేస్తాం. కొన్ని పాఠశాలల్లో టీచర్ల చొరవతో మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఆగస్టులో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ నిర్వహించబోతున్నాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు సంబంధించి 15ఏళ్ల తర్వాత మొదటిసారి సంస్కరణలు తెస్తున్నాం. ప్రతి మండలంలో గవ్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్నాం. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ కు ప్రాధాన్యతనిస్తున్నాం. పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తాం. కెరీర్ గైడెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
యూనివర్సిటీల వీసీలుగా విద్యావేత్తలు
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు విద్యావేత్తలను విసిలుగా నియమించాం. హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెద్దఎత్తున సంస్కరణలు తెస్తున్నాం. న్యాయపరమైన చిక్కులను తొలగించి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీచేస్తాం. యూనివర్సిటీల అడ్మినిస్ట్రేషన్ కు యూనిఫైడ్ యాక్ట్ తేవాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటుచేసి, డీప్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. అమరావతిలో లా యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగువర్సిటీల ఎక్కడ ఏర్పాటుచేయాలనే విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయిస్తాం. మండల నుంచి రాష్ట్రస్థాయి వరకు పబ్లిక్ లైబ్రరీలతోపాటు సెంట్రల్ లైబ్రరీ కూడా ఏర్పాటుచేస్తాం. స్వయం, స్వయం ప్లస్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ చేసి ఇండస్ట్రీ కనెక్ట్ విధానాలను అమలుచేస్తాం. ప్రాంతాల వారీగా ఫోకస్ పాయింట్లను నిర్ణయించి ఆయా జిల్లాల్లో వచ్చే పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే సుజలాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. పిల్లలు కాలేజిలనుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగం రావాలన్నదే మా లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు.
ప్రపంచానికి అవసరమయ్యే టాలెంట్ అందిస్తాం
ఓం క్యాప్ పేరు మార్చి ప్రపంచానికి కావాల్సిన టాలెంట్ను అందిస్తాం. భవన నిర్మాణ కార్మికులు, నర్సులకు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇచ్చి, ప్రపంచంలో ఎక్కడ అవకాశాలున్నా అందిపుచ్చుకునేలా స్కిల్ అప్ గ్రేడేషన్ చేస్తాం. ఐటిఐ, పాలిటెక్నిక్ లను ఎన్ బి సి ఎక్రిడిటేషన్ తో అనుసంధానిస్తాం. పాలిటెక్నిక్, ఐటిఐ విద్యార్థులకు ఎసెస్ మెంట్ ప్రధాన లోపంగా ఉంది. ఇందుకోసం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ఎసెస్ మెంట్ చేపట్టాం. సిఎంకు వివరించి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తాం. నైపుణ్యశిక్షణకు స్కిల్ హబ్స్ కూడా ఏర్పాటుచేస్తాం. మంగళగిరిలో చేనేత కార్మికులు స్వర్ణకారులుగా కూడా ఉన్నారు. మంగళగిరిలో భారత్ లో బెస్ట్ జ్యుయలరీ పార్కును 75ఎకరాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఇందుకు మంగళగిరిలో ఉన్న ఐటిఐలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడతాం. స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఇప్పటినుంచే పునాదులు వేస్తాం. శివారు జిల్లాల్లోని పాఠశాలల్లో కన్నడ, ఒరియా, తమిళ భాషలను ప్రవేశపెడతాం. మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషలను ప్రోత్సహిస్తాం. పెండిరగ్ ఫీజు రీఎంబర్స్ మెంట్ పద్ధతి ప్రకారం విడుదల చేస్తాం.ఆర్ట్ క్రాప్ట్, పిఇటిలపై సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆక్రమణలను తొలగిస్తాం. స్కిల్ డెవలప్ మెంట్, కెరీర్ కౌన్సిలింగ్ తప్ప ఇతరాలను అనుమతించం. మోడల్ ప్రైమరీ స్కూళ్లను బాధ్యతగా తీసుకుంటాం. అయిదేళ్లలో ప్రైవేటుకంటే అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని వెల్లడిరచారు.
నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లకోసం ఎమ్మెల్యేలు రికమెండ్షేషన్ లెటర్లు ఇచ్ స్థాయికి తెస్తాం. అయితే ఇది లోకేష్ వల్లే సాధ్యం కాదు, అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ స్కూళ్లకు ఇచ్చే యాప్లో ఎమ్మెల్యేలకు ఒక పేజీ ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో ప్రతి స్కూలుకు ఒక్కసారైన ఎమ్మెల్యే సందర్శించండి. మీరు చూశాక సూచనలిస్తే అమలుచేస్తాం. ఏకపక్ష నిర్ణయాలు మావద్ద ఉండవు. 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు ఉండవచ్చు. సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాలలను మండలానికి ఒకటి దత్తత తీసుకొని విజిట్ చేయండి. డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. తగ్గించేందుకు కలసికట్టుగా కృషిచేద్దాం. అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు, ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు, చాలా సమస్యలపై ఉమ్మడిగా చర్చిస్తున్నాం. కలసికట్టుగా పనిచేస్తున్నాం. రాబోయే ఐదేళ్లలో ప్రపంచం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించి చర్చించేలా అంతా కలసి పనిచేద్దామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.