- రాజధాని రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టీకరణ
- వైసీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం
- రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పిన కేంద్రమంత్రి
న్యూఢల్లీి (చైతన్యరథం): అమరావతిపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి స్వయంగా ఆ పార్టీకి చెందిన ఎంపీనే లోక్సభలో చెక్ పెట్టాడు. రుణభారం.. అప్పుల మోత అంటూ ప్రచారం చేసిన వైసీపీకి, వాళ్ల ఎంపీ అడిగిన ప్రశ్నకే కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.. అందుకు అనుగుణంగానే రాజధానికి రుణాలు సమకూర్చే వ్యవహారంలో సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో వైసీపీ సభ్యుడు గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలు ఆ రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావు. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఇప్పటివరకు ప్రత్యేక సాయం, గ్రాంట్స్ కింద ఏపీకి రూ.2,500 కోట్లు ఇచ్చాం. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత, సుస్థిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశాం. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రుణాలకు సంబంధించిన పంపిణీ ఇంకా జరగలేదు.
ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతానికి మించకుండా గరిష్ఠంగా రూ.1,500 కోట్లు, ప్రత్యేక సాయంగా (గ్రాంట్) ఆంధ్రప్రదేశ్కు ‘‘కౌంటర్ పార్ట్ ఫండిరగ్’’ సమకూర్చాలని కూడా నిర్ణయించాం. ఈ ప్రాజెక్టుకు అందిస్తున్న రుణాన్ని రాష్ట్ర రుణ పరిమితి (ఎఫ్ఆర్బీఎం)లో లెక్కించకూడదని నిర్ణయించాం. రుణం మంజూరు చేసేటప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, షరతులను అనుసరించి నిధుల వినియోగంపై పర్యవేక్షణ ఉంటుందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు.
దీంతో రాజధాని అమరావతిపై అప్పులు అంటూ, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టినట్లయింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని స్పష్టం చేసింది. తమ ఎంపీ ద్వారానే, తాము చేస్తున్నది ఫేక్ ప్రచారం అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ తెలియచేయటం విశేషం.