- 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి
అమరావతి (చైతన్యరథం): మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ పొందవొచ్చునన్నారు. బీసీ, ఈబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంతమందికైనా ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని ఆ ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు.
10 నుంచి ‘బీసీ’ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తెలిపారు. ఈ నెల పదో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ ఫలితంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోనూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాట్లకు దరఖాస్తుల స్వీకరణ నిలిపేశామన్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన లబ్ధిదారులంతా ఈ నెల పదో తేదీ నుంచి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా రుణాల మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు.