ఒంగోలు (చైతన్యరథం): ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)తో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం నాడు తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్దిదారులు ముఖ్యమంత్రికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.