- దశలవారీగా స్కూళ్లలో ప్రహరీగోడల నిర్మాణం
- నాడు-నేడు అక్రమాలపై విచారణ జరిపి చర్యలు
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీగోడల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం, ఉపాధి హామీ, మన బడి` మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్తో దశలవారీగా ప్రహరీగోడల నిర్మాణం చేపడతామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, నాడు-నేడు అక్రమాలు, అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు, డ్రగ్స్ నివారణపై శాసనసభ్యులు అదితి గజపతిరాజు (విజయనగరం), మిరియాల శిరీషకుమారి (రంపచోడవరం), బండారు శ్రావణి శ్రీ (శింగనమల), పల్లె సింధూర రెడ్డి (పుట్టపర్తి) అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సోమవారం సమాధానమిస్తూ… ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాఠశాలల్లో మౌలిక వసతులు, ఫలితాలపై స్టార్ రేటింగ్ ఇచ్చాం. కనీస మౌలిక సదుపాయాలు లేని 1,2 స్టార్ రేటింగ్ పాఠశాలలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచిలు, టాయ్లెట్లు, తాగునీరు వంటి కనీస వసతుల కల్పనపై దృష్టిపెట్టాం.
ఈ విషయమై శాసనసభ్యులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం 117 జీఓతో నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. 117 జీఓకు ప్రత్యామ్నాయంపై ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నాం. నాడు-నేడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించి వివరాలు సేకరించి, వాటిని పూర్తిచేస్తాం. 117 జీవోకు ప్రత్యామ్నాయంపై చర్చించిన తర్వాత టీచర్ల బదిలీలు, మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం చేపట్టిన నాడు ` నేడు పనులపై అనేక ఆరోపణలు వచ్చాయి, 117 జీఓ కారణంగా పనులు ప్రారంభించిన కొన్ని పాఠశాలలు మూతపడ్డాయి. నాడు-నేడు అవతకవకలపై నివేదిక తెప్పించుకుని, సభ్యులతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించాల్సి ఉంది. ఇక్కడ ప్రత్యేక పథకం ద్వారా మౌలిక సదుపాయాలు పూర్తిచేస్తాం.
కెజిబివిలకి సంబంధించి నూరుశాతం ప్రహరీ గోడలను ఈ సంవత్సరం డిసెంబర్ లోగా పూర్తిచేస్తాం. రాబోయే 3నెలల్లో సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటుచేస్తాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతోపాటు సభ్యులంతా బాగస్వాములు కావాలి. పాఠశాలలకు స్టార్ రేటింగ్ తోపాటు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్లో సంస్కరణలు తెస్తున్నాం. సభ్యులు వారి నియోజకవర్గాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు సమీకరించుకొని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషిచేసి, స్టార్ రేటింగ్ మెరుగు పర్చాలి. అందరూ కలసికట్టుగా ప్రహరీగోడలు, బేసిక్ ఇన్ ఫ్రా కు చొరవచూపాలి. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
డ్రగ్స్ నివారణకు చేపడుతున్న చర్యలపై లోకేష్ సమాధానమిస్తూ… డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేపడుతున్నాం. గంజాయి కారణంగా ఒక తరం ఎలా నాశనమవుతుందో తెలియజెప్పి, విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతిపాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటుచేస్తున్నాం. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తాం. పదోతరగతి, ఇంటర్ పరీక్షల తర్వాత ఈ క్లబ్బులను యాక్టివేట్ చేస్తామన్నారు.