- స్కిల్ బితో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం
- ఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలు
- మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్కిల్ బి అవగాహన ఒప్పందం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపాదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాలు గురువారం ఎంఓయుపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… జర్మనీలో వృద్ధుల సంరక్షణ, హాస్పటల్స్లో 3 లక్షల మంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు. యూరప్లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను రాష్ట్రంలో నర్సింగ్ విద్యనభ్యసించిన విద్యార్థినులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. ఈ శిక్షణ వల్ల ప్రతిఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజితో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ వింజమూరి రవిచంద్ర గౌతమ్, సీఈఓ ఉజ్వల్ చౌహన్ మాట్లాడుతూ… తమ సంస్థ ఆధ్వర్యాన ఇప్పటివరకు 10వేల మందికి పైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. స్కిల్ బి అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ రిక్రూట్మెంట్ స్టార్టప్లలో ఒకటిగా ఉందని తెలిపారు. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నామని అన్నారు. ఏపీఎస్ఎస్డీసీ భాగస్వామ్యంతో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం స్పెషలైజేషన్తో గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి, ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్కిల్ బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఎస్ఎస్డీసీలు భాషా నైపుణ్య కొరతను పరిష్కరించి, ఏపీని నైపుణ్య రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4వేల మందికి పైగా నర్సింగ్ విద్యార్థినుతకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ఏపీఎస్ఎస్డీసీ సీఈఓ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్, మెడిక్రూటర్ ఎండి రోనాల్డ్ రెస్కే పాల్గొన్నారు.