- గత ప్రభుత్వంలో మద్దతు ధరను తగ్గించారు
- వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి బురద జల్లే వ్యాఖ్యలు
- రైతుల మేలు కోసమే ఎంఎస్పీ ఖరారు చేయలేదు
- గత బకాయిలు చెల్లించి చంద్రబాబు మంచి చేశారు
- ధరపై కేంద్రంతో చర్చించేందుకు ఢల్లీి వెళుతున్నారు
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటవరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి సాగు చేసుకోవడం వల్ల ఎగుమతులు చాలా తగ్గి ధరలు కూడా తగ్గినట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడం వల్ల మళ్లీ ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు పెద్దఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రకటించలేదని తెలిపారు. లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు. రాష్ట్రంలోని మిర్చి రైతులకు సాధ్యమైనంత మేర సహకరించాలని, ప్రస్తుతం ఉన్న కేంద్రం మద్దతు ధరను కూడా పెద్దఎత్తున పెంచాలని కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీి వెళుతున్నారని చెప్పారు. ఈ విషయంలో కేంద్రానికి సీఎం ఇప్పటివరకూ నాలుగు లేఖలు రాయడం జరిగిందన్నారు. అలాగే కేంద్రమంత్రుల బృందంతో చర్చించనున్నారని, చర్చల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంలో మిర్చి రైతులకు నష్టం
అయితే ఈ విషయాలను అన్నింటినీ వక్రీకరిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాజకీయం చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రయత్నించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. మిర్చి రేటు రూ.13 వేలకు పడిపోయిందని ఆరోపిస్తున్నారని, అయితే గత పదేళ్లలో మిర్చి ధరలు పరిశీలిస్తే అత్యధికంగా రూ.13,600 మాత్రమే ఉందని తెలిపారు. కేవలం గత రెండేళ్లు మాత్రమే అంతర్జాతీయంగా కొన్ని కారణాలు వల్ల మిర్చి రైతుకు రూ.20 వేల ధర పలికిందన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70 శాతం జనాభాకు ప్రధాన జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలను గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. భూసార పరీక్షలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, వ్యవసాయ యాంత్రీకరణ కింద ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు. బిందు సేద్యాన్ని ప్రోత్సహించే విధం గా డ్రిప్ / స్ప్రింక్లర్లను ఏ ఒక్కరికీ పంపిణ ీచేయలేదన్నారు. దాదాపు రూ.1600 కోట్లు మేర ధాన్యం కొనుగోలు బకాయిలను పెట్టిపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటే రైతులకు ఆ సొమ్మును చెల్లించడం జరిగిందన్నారు. 2020 జనవరి మాసంలో బహిరంగ మార్కెట్లో మిర్చి ధర దాదాపు రూ.12 వేల వరకూ ఉంటే అదే సమయంలో జగన్ ప్రభుత్వం మిర్చికి రూ.7,000 కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు పూర్తిస్థాయిలో నష్టాన్ని కలిగించిందని గుర్తుచేశారు. ఆ సమయంలో కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద ఒక్క పైసా కూడా అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2017లో దాదాపు రూ.138 కోట్ల మేర మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కేటాయించి రైతులను పెద్దఎత్తున ఆదుకోవడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను పెద్దఎత్తున ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు ఢల్లీిరావు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు, రైతుబజార్ల సీఈవో విజయసునీత పాల్గొన్నారు.