అమరావతి (చైతన్య రథం): గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడటమేనని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ.. వారి హక్కులు కాపాడతామన్నారు. పాడేరులో గిరిజనుల నిరసన నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా సీఎం స్పందించారు. ‘‘గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు నిరంతరం పనిచేస్తున్నాం. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో జీవోనెం 3 తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి. దాని పునరుద్ధరణకు కృషి చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలనే ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలు, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందొద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నాం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.