అమరావతి: కేంద్ర బడ్జెట్ 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఎక్స్ వేదికపై స్పందించిన సీఎం చంద్రబాబు.. పేదలు, రైతుల ఆకాంక్షలకు ప్రాధాన్యత కనిపిస్తోందన్నారు. ‘ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ప్రజానుకూల ప్రగతిశీల బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి కేంద్రం ఇస్తోన్న ప్రాధాన్యత బడ్జెట్లో ప్రతిబింబిస్తోంది. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించింది. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్గా పనిచేస్తుందని బడ్జెట్పై కామెంట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.