- సమస్యలు పరిష్కరించి అండగా నిలుస్తానని హామీ
- సమస్యలు పరిష్కరించి అండగా నిలుస్తానని హామీ
తిరుపతి (చైతన్య రథం): పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అనంతరం విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 59వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. 2007 నుంచి 2011 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులై, సొంత మండలాల్లోని పీహెచ్సీ సబ్ సెంటర్లలో సెకెండ్ ఏఎన్ఎమ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను క్రమబద్ధీకరించాలని మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. 16 ఏళ్లుగా రెగ్యులర్ వారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని, వేతనాలు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగావున్న రెగ్యులర్ ఏఎన్ఎమ్ పోస్టులను 2007నుంచి పనిచేస్తున్న సెకెండ్ ఏఎన్ఎమ్లతో భర్తీ చేయాలని కోరారు. ఎస్ఎల్ఎమ్పీసీ కార్పొరేషన్ తరఫున తిరుమల లడ్డూ కౌంటర్నందు విధులు నిర్వహించే తాను రోడ్డు ప్రమాదం కారణంగా కొన్ని నెలలుగా విధులకు హాజరుకాలేకపోయానని, రీజాయినింగ్కు అనుమతించాలని తిరుపతికి చెందిన ఏ నాగసాయి కార్తీక్ విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద భూమి కోల్పోయానని, ఇంటర్ చదివిన తన కుమారుడికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ఐరాల మండలం చెంగనపల్లెకు చెందిన పి మునేశ్వరశెట్టి కోరారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.