వైసీపీ ఐదేళ్ల పాలనాకాలంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీల వరంగా మారడమే కాదు, పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమైంది. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు సాధించి.. రాష్ట్రాదాయం పెంచడమే కాదు, యువతకి ఉపాధి కల్పిస్తానన్న సీఎం మాటపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. అందుకు తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలే నిదర్శనం! ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు గుండెలుంటాయి కానీ హృదయం అరుదు. నేడు అటువంటి హృదయమున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. 2047 విజన్ సాకారం కోసం సీఎం చంద్రబాబు నిర్దేశించుకున్న పది సూత్రాలే ప్రగతికారక ఏపీకి శ్రీరామ రక్ష!!
గత ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రానికి ఒక పీడకల. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని తర్వాత ఐదేళ్ల పాలన విధ్వంసానికి గురిచేసింది. రాష్ట్రంలో ఆర్ధిక అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సకల వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. వీటిని సరిదిద్ది ప్రగతి రథాన్ని పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అందుకే `పునర్నిర్మాణంతో ఏపీని ఛాంపియన్గా నిలపాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కాలంతో పోటీపడ్డారు. కేంద్ర సహకారంతో ఏపీని ప్రగతిపథాన నిలపడంపైనే దృష్టి పెట్టారు. కూటమి ఏడాది శ్రమ ఫలించిందన్న విషయాన్ని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. 2024-25లో జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ, తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. 8.21 శాతం వృద్ధిరేటుతో దేశంలో ఏపీ రెండోస్థానంలో, తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానంలో నిలిచిందన్న విషయాన్ని కేంద్ర గణాంకాలే (మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్) చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలన ఈనెల 12నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరు విశ్లేషించినప్పుడు.. ప్రజాకాంక్షలను నెరవేరుస్తూ.. నమ్మకాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగుతోందన్న సంతృప్తికర సమాధానాలే లభిస్తున్నాయి.
వైకాపా ఐదేళ్ల పాలనలో దగాపడ్డ మధ్యతరగతి, అట్టడుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్యంతో విలక్షణ ప్రజా సంక్షేమపాలనకు శ్రీకారం చుట్టింది కూటమి. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని అద్భుత వ్యూహంతో రెండంకెల వృద్ధి రేటు సాధించి నవ్యాంధ్రను ప్రగతిపథం బాట పట్టించటంలో కృతకృత్యులయ్యారు. ఏడాది పాలనలోనే రాష్ట్రం 8.21 శాతం వృద్ధి సాధించడమే అందుకు నిదర్శనం. సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు సీఎం చంద్రబాబు ఏపీలో అమలుచేసిన పాలసీలు, విధానాలు రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. 2023-24 (వైసీపీ హయాం)లో వృద్ధి రేటు 6.19 శాతమైతే.. 2024-25లో 8.21 శాతం సాధించి దేశంలోనే ఏపీని రెండోస్థానంలో నిలపడం వెనుక కూటమి కృషి లేదని ఎవరనగలరు. ఏడాది కాలంలో వృద్ధి రేటు పెంపు 2.02 శాతం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు విభాగాల్లో తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు మెరుగైన ఫలితాలనిచ్చి.. రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాయి. 2024-25లో రాష్ట్రం 8.21 శాతం వృద్ధిరేటుతో రూ.8.65 లక్షల కోట్ల జీఎస్డీపీని సాధించిందన్నది కేంద్రం తన నివేదికలో పొందుపర్చిన అంశం. ప్రస్తుత ధరల ప్రకారం 12.02 శాతం వృద్ధిరేటుతో రూ.15.93 లక్షల కోట్ల జీఎస్డీపీ నమోదు చేసుకుని 5వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15.41 శాతం వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయ రంగంలో 22.98 శాతం, ఉద్యాన రంగంలో 21.29, పారిశ్రామిక రంగంలో 6.4, నిర్మాణ రంగంలో 10.28, ఉత్పాదక రంగంలో 15.18, సేవలు 11.82, విద్య, ఆరోగ్యం 12.15, వాణిజ్యం, హోటళ్లు, ఇతర రంగాల్లో 11.58 శాతం వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్స్, ఇతర రంగాలు 11.22 శాతం నమోదు చేశాయి. 2024-25లో తలసరి ఆదాయంలో 11.89 శాతం వృద్ధి నమోదైంది. తలసరి రాబడి రూ.2,66,240కు చేరింది. ఇందులో రాష్ట్రం 3వ స్థానంలో నిలవగా, తమిళనాడు, కర్ణాటక మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
వైసీపీ ఐదేళ్ల పాలనాకాలంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీల వరంగా మారడమే కాదు, పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమైంది. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు సాధించి.. రాష్ట్రాదాయం పెంచడమే కాదు, యువతకి ఉపాధి కల్పిస్తానన్న సీఎం మాటపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. అందుకు తొలి ఏడాదిలో కూటమి
ప్రభుత్వం సాధించిన విజయాలే నిదర్శనం!
తొలి ఏడాదిలోనే ఎన్నో విజయాలు సాధించింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గద్దెనెక్కే సమయానికి రాష్ట్రం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకునివున్నా వెరవకుండా.. ఇచ్చిన మాటమేరకు పింఛను పథకంపై ముందడుగే వేశారు. అప్పటి వరకూ అమలవుతున్న రూ.3వేల పింఛనును ఒక్కసారిగా వెయ్యి పెంచి రూ.4 వేలను అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచే పెంపును వర్తింపజేసి.. జూలై 1న పింఛను కింద రూ.7 వేల చొప్పున ఇవ్వడంతోనే కూటమి సర్కారు ప్రజా నమ్మకాన్ని చూరగొంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రూ.2వేల పింఛనును రూ.3వేలు చేయడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. అదీ.. దివ్యాంగులకు ఒక్క రూపాయి పెంచలేదు. దివ్యాంగులకిచ్చే రూ.3 వేల పింఛనును రూ.6 వేలకు పెంచి.. తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డవారికి రూ.5 వేల పింఛనును రూ.15 వేలు చేసిన ఘనత కూటమిదే. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కాకుండా ఇంకా ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేల మొత్తాన్ని రూ.10 వేలకు పెంచారు. జగన్రెడ్డి సర్కారు పింఛను సంక్షేమం కోసం నెలకు రూ.1,939 కోట్లు వెచ్చిస్తే.. కూటమి సర్కారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పథకానికి నెలకు రూ.2,834 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క పింఛన్లకే ఏడాదికి రూ.34 వేల కోట్లు… ఐదేళ్ళల్లో రూ.1.7 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.
పేదోడి నోటిదగ్గర కూడు లాగేసి.. జగన్ నిలిపేసిన అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి రాగానే పునరుద్ధరించింది. 204 అన్న కాంటీన్లను నెలకొల్పి.. సగటున రోజుకు 3 లక్షల మంది ఆకలి తీరుస్తోంది. దీపం-2 పథకం ప్రారంభించి 2025 మార్చినాటికి తొలి విడతగా 1.15 కోట్లమందికి ఉచిత సిలిండర్ అందించింది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు రూ.2,684 కోట్ల వ్యయం కాగా.. ఐదేళ్లలో మొత్తం ప్రభుత్వంపై రూ.13,423 కోట్ల భారం పడనుంది. మూడో విడతనుంచి సిలిండర్కి అయ్యే సొమ్మును ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. 16,347 ఉపాధ్యాయ నియామకాలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది కూటమి. జగన్ ఐదేళ్ల పాలనాకాలంలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదన్నది అక్షర సత్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గాలు సిద్ధం చేస్తోంది. 6,100 పోలీస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్కు చర్యలు తీసుకుంది. రూ.9.4 లక్షల కోట్లు పెట్టుబడులు ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించింది. సబ్ప్లాన్ నిధులను మళ్ళించకుండా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాలకు వెచ్చిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలుకు రంగం సిద్ధం చేసింది. ఇంటర్ విద్యార్ధులకు తిరిగి మధ్యాహ్న భోజనం ప్రారంభించింది. గంజాయి, డ్రగ్స్, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలపై ఉక్కుపాదం మోపింది. గుంతలమయమైన 20 వేల కి.మీ రోడ్లు మరమ్మత్తులు చేసింది. వీటితోపాటు, సీసీ, బీటీ, రాష్ట్ర రహదారులు 7వేల కి.మీ నిర్మిస్తోంది. ఒకేరోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,987 కోట్లు పంచాయతీలకు విడుదల చేసింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద దాదాపుగా 55 లక్షలమంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది. పీఎం కిసాన్తో కలిపి ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా.. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం ఈనెల నుంచే అందించనుంది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక సేద్యం ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా ఆధునిక లాభసాటి సేద్యంవైపు రైతులను మళ్లిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి.. ఆరోగ్యకర సేద్యపు వాతావరణాన్ని ఆవిష్కరించే ప్రణాళికలు అమలు చేస్తోంది.
అనేక విభాగాలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.24 వేల కోట్లు కూటమి సర్కారు చెల్లించింది. పోలవరానికి కేంద్రంనుంచి రూ.12,157 కోట్లు సాధించింది. నిర్వాసితులకు రూ.1,000 కోట్లు చెల్లించింది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు సాధించింది. విశాఖ స్టీల్ పరిరక్షణకు రూ.11 వేల కోట్లు, విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని శంకుస్థాపన, ఓర్వకల్లు పారిశ్రామికవాడకు రూ.2,786 కోట్లు, కొప్పర్తి పారిశ్రామికవాడకు రూ.2,137 కోట్లు కేంద్రంనుంచి సాధించడం విశేష ఫలితమే. హంద్రీనీవా విస్తరణకు రూ.3,800 కోట్లతో వేగంగా పనులు నిర్వహిస్తోంది. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్మాణాత్మక కృషి సలిపింది. ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.1,198.12 కోట్లు కేటాయించింది. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ పునరుద్ధరించింది. కర్నూల్లో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు, 35వేల డ్రోన్ పైలట్లకు శిక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో రాష్ట్ర జీడీపీ రూ.16 లక్షల కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ సముద్రతీరం, విశాల భూభాగం, పెట్టుబడులకి అనుమైన వాతావరణం, అందుబాటులో మానవ వనరులు.. అన్నిటికీతోడు రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడిపే నాయకుడు. వెరసి ముక్కోణపు వ్యూహంతో ఏపీ ముందడుగు వేసింది, వేస్తోంది. భవిష్యత్ అవసరాల్ని అందుకునే భారీ ప్రణాళికలు ఇప్పటికే ఉన్నాయి. స్వర్ణాంధ్రగా తనని తాను ఆవిష్కరించుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తోంది. మొత్తంమీద శిథిలంనుంచి శిఖరంవైపు సాగుతోన్న ప్రయాణం.. ఏడాది పాలనా కాలంలో స్పష్టంగా కనిపిస్తోంది!
ఆంధ్రప్రదేశ్ను అమరావతి, తిరుపతి, కర్నూలు- ఓర్వకల్లు, గోదావరి జోన్లుగా విభజించి ప్రాంతీయంగా అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ప్రస్తుతం అమరావతిలో క్వాంటం వ్యాలీ, కర్నూలు- ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, విశాఖపట్నంలో మెడిటెక్ జోన్లను అభివృద్ధి చేయాలని, వీటికితోడు విశాఖ-చెన్నై, హైదరాబాద్- బెంగళూరు, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లలో పారిశ్రామిక నగరాల అభివృద్ధికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బ్లూ, వైట్కాల్ జాబ్లు సృష్టించి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించే ప్రణాళికలు అమలు చేస్తోంది.
సౌర, పవన, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజీ ఉత్పత్తి ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ తయారుచేసే దిశగా ప్రయాణం సాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రంలో నవకల్పనలను ప్రోత్సహించి పరిశ్రమ- విద్యారంగం మధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేసి, వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు గుండెలుంటాయి కానీ హృదయం అరుదు. నేడు అటువంటి హృదయమున్న ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. పీ`4తో నిరుపేద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 2047 విజన్ సాకారం కోసం సీఎం చంద్రబాబు నిర్దేశించుకున్న పది సూత్రాలే శ్రీరామ రక్ష!
నీరుకొండ ప్రసాద్