నరసరావుపేట (చైతన్యరథం): సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అరెస్టయి ప్రస్తుతం రాజంపేట జైలులో ఉన్న పోసానిని అక్కడి ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.