- 2014-19 మధ్య ఉపాధి హామీ బకాయిల సమస్య పరిష్కరించాలి
- కంది సేకరణ గడువు పెంచాలి
- కేంద్ర వ్యవసాయ మంత్రికి రామ్మోహన్ నాయుడు వినతి
న్యూఢల్లీి: పామాయిల్ దిగుమతులపై సుంకం సవరించే విషయమై కేంద్ర వ్యవసాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చర్చలు జరిపారు. దేశ రాజధాని ఢల్లీిలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రాష్ట్ర రైతుల సమస్యల చర్చించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మూడు ప్రధాన అంశాల మీద ఇద్దరి చర్చ సాగింది. 2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని రామ్మోహన్నాయుడు కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముడి వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించటం వల్ల దేశీయంగా పామాయిల్ పంట సాగు చేస్తున్న రైతులు నష్టపోతారని, ఆ సుంకాన్ని పాత రేటు ప్రకారం కొనసాగించాలని కోరారు. అలాగే నాఫెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ) ద్వారా పప్పు దినుసులు ముఖ్యంగా కందిపప్పు సేకరించే గడువు ఈనెల 15తో ముగియనుందని, రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని సేకరణ గడువు మరింత పెంచాల్సిందిగా కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.