- వికసిత్ భారత్కు ఇదొక గ్రోత్ ఇంజన్
- రాజధాని నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం
- 60వేల కోట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం…
- స్వప్న సాకారం ఖాయమన్న భావన కలుగుతోంది
- చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు
- దేశంలో టెక్నాలజీకి కొత్త బాటలు వేసింది బాబే
- పెద్ద ప్రాజెక్టులు చేపట్టం ఆయనకే సాధ్యం
- చంద్రబాబు పాలనలో రాష్ట్రం ప్రగతి పరుగులు
- ఆధునిక, అధునాతన ప్రదేశ్ కావడం ఖాయం
- భారత్ బలమంటే ఆయుధాలే కాదు, ఐకమత్యం కూడా
- ‘అమరావతి’ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉవాఛ
- విశాఖలో నిర్వహించే యోగా డేకు హాజరవుతానని హామీ
అమరావతి (చైతన్య రథం): అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతమన్నారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని.. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని ఉద్ఘాటించారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టిన ఆయన.. ‘‘దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. తన ప్రసంగం మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు
‘‘టెక్నాలజీ నాతో మొదలైనట్టు చంద్రబాబు ప్రశంసించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్దపెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్నిరకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది’’ అన్నారు.
పవన్జీ.. ఇది మనమే చేయాలి..
‘‘ఎన్టీఆర్… వికసిత ఏపీ కోసం కలలుగన్నారు. మనందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలి. పవన్ కల్యాణ్ ఇది మనం చేయాలి. మనమే చేయాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు సాయం చేస్తోంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు. ఒక స్వప్నం సాకారాం కాబోతోందనే భావన కలుగుతోంది. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు. ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, చంద్రబాబు, పవన్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా’’ అన్నారు.
‘‘ఇంద్రలోకం రాజధాని అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునికప్రదేశ్, అధునాతనప్రదేశ్గా మార్చే శక్తి అమరావతి. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మారుతుంది. అమరావతిలో మౌలికవసతుల కల్పనకు కేంద్ర సహకరిస్తుంది’’ అని చెప్పారు.
కనెక్టివిటీకి కొత్త అధ్యాయం..
‘‘ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లానుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం తీర్ధయాత్రలకు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వేబడ్జెట్ రూ.900 కోట్లలోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతంకంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్లు, అండర్పాస్లు నిర్మించాం. వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టులవల్ల వేలమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతు వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషిచేస్తోంది. రైతులకు పథకాలు, పరిహారం కింద రూ.17 వేల కోట్లు సాయం చేశాం. పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తాం. ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేందుకు కృషిచేస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
‘‘పలు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంటూ.. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదలు, యువత అభివృద్ధి చెందాలన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలన్నారు. ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలు లాంటివారని మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాయలంకలో టెస్టింగ్ రేంజ్.. దుర్గామాతలాగా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్ కోట్లాది భారతీయులకు గర్వకారణం. భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదు.. మన ఐక్యత కూడా. విశాఖలో యునిటీమాల్ అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
విశాఖలో యోగా డేకు హాజరవుతా
‘‘విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాల. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువకాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోంది. సరైన వేగంతో ముందుకెళ్తుంది. దీన్ని కొనసాగించాలి. మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏస్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోంది. ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తాను. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉప ముఖ్యమంత్రి కె పవన్కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్త, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాజధానిసహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.