` కిలో రూ.500 ధరకు గింజలు కొనుగోలు
` పొగాకు రైతులకూ అండగా ఉంటాం
` ఇది రైతు పక్షపాత ప్రభుత్వం
` వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ
ఏలూరు (చైతన్యరథం): రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్ధసారధితో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాటలైతే విపరీతంగా చెప్పారు.. చేతలు మాత్రం శూన్యమని విమర్శించారు. రూ.3 వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్నారు. ఎంత ఖర్చు చేశారో చూస్తే సున్నా, ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. అందుకు సంబంధించి ఐదేళ్ళ రికార్డు మా దగ్గర ఉందని మంత్రి చెప్పారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో రైతుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు సరి కదా, కనీసం రైతులు, రైతు సంఘాలను కూడా కలవలేదన్నారు. రైతుల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిరదన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రూ.140 కోట్ల స్థిరీకరణ నిధి పెట్టి ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశామన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా..
రాష్ట్రంలో నాలుగైదు పంటలకు ధరల్లో ఇబ్బంది వచ్చిందని, ఆయినా ప్రభుత్వం తనకు సంబంధ లేదని ఊరుకోలేదన్నారు. ఆరు నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైనే దృష్టిపెట్టారన్నారు. మిర్చి పంటకి ఇబ్బందులు వస్తే మిర్చి పండిరచిన రైతుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంతో మాట్లాడి పరిష్కరించామన్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో ఏలూరు జిల్లాలో కోకో రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదే విధంగా ప్రకాశం జిల్లాలో (నల్లబర్లీ) పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదే విధంగా మామిడి పండిరచిన రైతులకు ఇబ్బందులు వచ్చాయని, వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు. వీరు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏ పంటలు వేస్తున్నారు.. ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతుకు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గత రెండు మాసాల నుంచి జిల్లాలో కోకో ధర విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. దీని నుండి తప్పించుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదన్నారు. రెండు మూడు సార్లు సమావేశాలు పెట్టామన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ సమావేశాలు పెట్టినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.
ఈ దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల దగ్గరకే వచ్చి సమావేశం నిర్వహించి సుమారు 3 గంటలు వారితో చర్చించామన్నారు. ఈ సంవత్సరానికి కోకో కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకున్నామని ఈ విషయంలో దాపరికం లేకుండా ఒక మధ్యస్థ ధర ఉండేలా కంపెనీలతో మాట్లాడామన్నారు. కంపెనీల వారు రూ. 450కి కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ మరో రూ.50 ప్రభుత్వం భరించి సమస్యను పరిష్కరించిందన్నారు. కోకోను కిలో రూ.500కు కొనుగోలు చేయాలని ప్రస్తుతం రైతుల దగ్గర ఉన్న కోకో గింజలను అన్నింటిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశామన్నారు. రైతులకు ఎక్కువ ధర వచ్చేలా కంపెనీలతో మాట్లాడాలని సీఎం చెప్పారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చాక్లెట్ల తయారీ ఉత్పత్తులు తగ్గాయని దీని మూలంగా కూడా కొంత సమస్య ఏర్పడిరదన్నారు. అయినప్పటికీ శనివారం నుంచి రైతలు దగ్గర ఉన్న కోకో కూడా మొత్తం కంపెనీలు కొంటాయన్నారు. కంపెనీలు ఇచ్చే ధరలకు అదనంగా ప్రభుత్వం కొంత భరిస్తుందన్నారు. భవిష్యత్తులో కోకో పంట విషయంలో కూడా ఒక చట్టం తెచ్చే యోచనలో ఉన్నామని, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర వచ్చేలా చట్టం రూపొందిస్తున్నామన్నారు. కోకో పంట నాణ్యత విషయంలో రైతులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కోకో అంతర పంట, రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు.
పొగాకు రైతులనూ ఆదుకుంటాం
మరోపక్క నల్ల బర్లీ పొగాకులో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఎగుమతులు ఆగిపోయాయన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా రైతులు, కంపెనీలు, పొగాకు బోర్డును కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లబర్లీ పొగాకు మొత్తం కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి డిమాండ్ ఆధారంగా పంట వేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. రైతులు ఏ పంటకు ధర వస్తే అదే పంటను ఎక్కువగా వేస్తున్నారని, ఈ సందర్బంలో ధర పతనమైతే నష్టపోతున్నారన్నారు. ధరలు రాలేదని, కౌలు పెరిగిందని రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి హితవు పలికారు. ఈ ప్రభుత్వం మీదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు తావులేకుండా ప్రభుత్వం ఆన్ని ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇది రైతుల ప్రభుత్వమని, వారికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్, ఉధ్యానవన శాఖ కమీషనరు కె. శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), సొంగా రోషన్ కుమార్, తదితరులు ఉన్నారు.