- గ్రీన్ ఎనర్జీ, డేటాసెంటర్ల ఏర్పాటుకు సహకరించండి
- గత ప్రభుత్వ పొరబాట్లను సరిచేసేందుకే సింగపూర్ వచ్చా
- సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్కు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
- విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానం
- హౌసింగ్, సబ్ సీ కేబుల్ సెక్టార్లో సహకారానికి సింగపూర్ ఓకే
సింగపూర్ (చైతన్య రథం): గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులు చేపట్టిందని.. వీటికి సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు కోరారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగాఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలు అనుసరించటంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ను చూసే గతంలో హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మరోవైపు ఏపీలో నవంబరు నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ను సీఎం ఆహ్వానించారు.
గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగాల్లో కలిసి పని చేసేందుకు సింగపూర్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రంగంలో సింగపూర్- ఏపీ కలిసి పని చేస్తామని వెల్లడిరచారు. గ్రీన్ ఎనర్జీ, గృహనిర్మాణంలాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి పని చేస్తున్నామని సింగపూర్ మంత్రి ఈ సందర్భంగా పీ సీఎం చంద్రబాబాకు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విషయాన్ని సింగపూర్ మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.